ఆలేరు పట్టణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. ఎన్నో ఏండ్లుగా రైల్వే గేటుతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఊరట లభించింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా
మహేందర్రెడ్డి చొరవతో రైల్వే గేటు వద్ద అండర్పాస్ పనులకు చర్యలు చేపట్టేందుకు అడ్డంకులు తొలిగాయి. రైల్వే అండర్పాస్ ఏర్పాటుతో బాధితులుగా మారిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేయడంతో అండర్పాస్ పనుల్లో వేగం పెరుగనున్నది. ఆలేరు పట్టణం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం 2019 అక్టోబర్లో అండర్పాస్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు, ఈ క్రమంలో తలెత్తిన అడ్డంకుల మూలంగా పనుల్లో జాప్యం ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి చొరవతో బాధితులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అండర్పాస్ నిర్మాణంలో నష్టపోతున్న నిర్వాసితులు 78 మంది ఖాతాల్లో రూ.5.30 కోట్ల నిధులు జమ అయ్యాయి. దీంతో అండర్పాస్ ఏర్పాటు పనులకు ఏర్పడిన అడ్డకులు పూర్తిగా తొలగిపోయాయి.
తీరనున్న ప్రయాణికుల కష్టాలు..
రైల్వే గేటుతో ఆలేరు పట్టణంలో ఎన్నో ఏండ్లుగా ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని రైల్వే గేటు నుంచి దేశంలోనే అతిపెద్ద జైన మందిరమైన కొలనుపాక, కోటిలింగాల క్షేత్రంతో పాటు వివిధ జిల్లాలు, మండలాలకు నిత్యం ప్రయాణాలు సాగించే వేలాది మందికి ప్రయోజనకారిగా రైల్వే అండర్పాస్ మారనున్నది.
అండర్పాస్ ఏర్పాటుతో నష్టపోతున్న బాధితులకు ఇబ్బందులు లేకుండా బాధితుల ఖాతాల్లో రూ.5.30 కోట్లు జమ కావడంతో బాధితులు పూర్తిస్థాయిలో అండర్పాస్ నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు.