నేరెడుగొమ్ము(చందంపేట), డిసెంబర్ 17 : అటవీ భూములను ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. కాచరాజుపల్లి, బుగ్గతండా గ్రామాలకు చెందిన రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిలో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటుతున్నారని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చందంపేట మండలంలోని చిత్రియాల, పెద్దమూలగుట్ట, పాలపేడ సమీపంలో అటవీ భూములను ఆయన పరిశీలించి మాట్లాడారు. అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. అనంతరం పట్టాదారు పాసు పుస్తకం కలిగిన రైతుల వివరాలు సేకరించారు. త్వరలో గ్రామ కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని తెలిపారు. ఆయన వెంట డీటీడబ్ల్యూఓ రాజ్కుమార్, దేవరకొండ ఆర్డీఓ గోపీరాం, ఎఫ్డీఓ సర్వేశ్వర్, ఎఫ్ఆర్ఓ సాయిప్రకాశ్, ఎంపీటీసీ బిక్కునాయక్, సర్పంచులు పాపానాయక్, నాగునాయక్, బాలూనాయక్, బుజ్జినాయక్, లాల్సింగ్, శ్రీదేవి పాల్గొన్నారు.