చిట్యాల, నవంబర్ 22 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమానికి మద్దతుగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి వలస కడుతున్నారు. మంగళవారం తిరుమలగిరి(సాగర్) మండలం నేతాపురం కాంగ్రెస్ సర్పంచ్ కుమారీవెంకట్రెడ్డి, ముగ్గురు వార్డు సభ్యులు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ సమక్షంలో నూతనకల్ మండలం మిర్యాలకు చెందిన కాంగ్రెస్ పార్టీగ్రామాధ్యక్షుడు మన్యం సైదులు, పలువురు వార్డు సభ్యులు గులాబీ కండువా కప్పుకొన్నారు. చిట్యాల మండలం ఎలికట్టెకు చెందిన కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు పెర్క శంకరయ్యతోపాటు కార్యకర్తలు, బీజేపీ నాయకులు కొందరు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వేములపల్లి మండలం మొల్కపట్నం, సల్కునూరుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే భాస్కర్రావు, ఆలేరుకు చెందిన బీజేపీ నాయకులు, కొలనుపాక కాంగ్రెస్ నాయకులను డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, అందుకే వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఎలికట్టె గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు పెర్క శంకరయ్య, ఉస్కిల భిక్షం, కొండపల్లి కృష్ణ, ఇప్పె లక్ష్మణ్, గోపాల్తో పాటు 50 మంది బీఎస్పీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాలు, పట్టాణాల రూపురేఖలు మారిపోయాయన్నారు. అందుకే దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులంటూ బయపట్టే కార్యక్రమం చేపడుతుందని, తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ కుట్రలను టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, జడ్పీటీసీ సుంకి ధనమ్మాయాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, సర్పంచ్ ఉయ్యాల సత్తయ్య, ఎంపీటీసీ గొలనుకొండ దశరథ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఉస్కిల్ల నాగరాజు, ఉయ్యాల కృష్ణయ్య, మండలి రోశయ్య పాల్గొన్నారు.