గట్టుప్పల్, అక్టోబర్ 18 : సమైక్య పాలనలో అన్ని విధాలుగా ఆగమై ఆదరణ కోల్పోయిన చేనేతకు స్వరాష్ట్రంలో చేయూత అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన చేనేత కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. పోరాడి సాధించిన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల తలరాత మార్చిందన్నారు. కనుమరుగయ్యే పరిస్థితికి చేరిన చేనేత వృత్తిని, చేనేత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకొని ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. వయో పరిమితి తగ్గించి చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఆడపడుచులకు అందజేస్తున్న బతుకమ్మ చీరలు సైతం తయారుచేసే పనిని చేనేత కార్మికులకు అప్పగించి వారి ఆర్థిక పురోభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎదుగుతున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అర్థంలేని పన్నుల భారం మోపుతూ నేతల నడ్డి విరిస్తుందన్నారు. బీజేపీలో గొప్ప నాయకులమని చెప్పుకునే వారు పన్నులపై మాట్లాడకపోవడంతో అడుగడుగునా నిలదీస్తుంటే సమాధానం దాటవేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటి బీజేపీపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం మునుగోడు ఎన్నిక రూపంలో వచ్చిందన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలో గట్టుప్పల్ నుంచి అధిక మెజార్టీ అందిద్దామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మాజీ ఎమ్మెల్సీలు చెరుపల్లి సీతారాములు, నారదాసు లక్ష్మణ్రావు, సర్పంచ్ ఇడెం రోజా, నాయకులు ఇడెం కైలాశ్, రామదాసు లక్ష్మణ్, శ్రీనివాస్, విద్యాసాగర్, భాస్కర్ పాల్గొన్నారు.