నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ఉపసంహరణ అనంతరం మొత్తం 47 మంది తుదిపోరులో నిలిచారు. ఆయా అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది. ఉప ఎన్నిక కోసం మొత్తం 130 మంది అభ్యర్థులు 199 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 15న జరిగిన స్క్రూట్నీలో 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 83 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉండగా, చివరి రోజైన సోమవారం 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. చివరికి మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. వీరి కోసం మూడు ఈవీఎం యూనిట్లు ఉపయోగించాల్సి వస్తున్నదని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్కు జై కొట్టారు. మర్రిగూడెం మండలం రాంరెడ్డిపల్లికి చెందిన పల్లేటి జంగయ్య, అంతంపేటకు చెందిన సుధాకర్నాయక్తోపాటు పలువురు నామినేషన్లు ఉపసంహరించుకొని టీఆర్ఎస్లో చేరారు. మర్రిగూడెం ఎంపీపీ మోహన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యీ రవీందర్రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.