పూల పండుగ బతుకమ్మకు ముందే ఆడబిడ్డల మోములో ఆనందం వెల్లివిరిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం బతుకమ్మ చీరెల పంపిణీ మొదలైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్వయంగా అందజేశారు. నకిరేకల్, చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంపిణీ చేశారు. సర్కారు సారెను అందుకుని మహిళలు మురిసిపోయారు. రంగులు, డిజైన్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు.
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 23 : ఉమ్మడి పాలకుల హయాంలో 60ఏండ్లకు పైగా అన్ని విధాలా ఆగమైన తెలంగాణ.. స్వరాష్ట్రంలోని సీఎం కేసీఆర్ పాలనలో ఎనిమిదేండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లాకేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ యావత్ తెలంగాణ జాతి గౌరవానికి గొప్ప సూచికగా నిలుస్తున్నదన్నారు. అంతరించిపోతున్న సంస్కృతీ, సంప్రదాయాలకు పూర్వ వైభవం తేవడంతో పాటు వేడుకలకు ప్రత్యేక నిధులు కేటాయించి అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. ఎనిమిదేండ్లుగా వేలాది కోట్లతో అన్ని రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం నింపుతున్నామన్నారు. ఏదైతే కలలు కని రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆదిశగానే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నా రు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పథకాలను యథావిధిగా కొనసాగించామని గుర్తు చేశారు. దేశంలోని ఇతర రాష్ర్టాలు సైతం సీఎం కేసీఆర్ పాలన తీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. దీన్ని కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీతో పాటు విపక్షాలు తట్టుకోలేక విషం చిమ్ముతున్నాయని విమర్శించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి శ్రీరామరక్ష
సీఎం కేసీఆర్ నాయకత్వం తెలంగాణకే గాక యావత్ దేశానికే శ్రీరామరక్ష అని మంత్రి కొనియాడారు. మూడేండ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడి వారు అక్కడే అన్నట్టుగా అరకొరగా సంబురాలు జరుపుకొన్నామని.. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో ఐక్యతతో పండుగ వేడుకలకు సిద్ధమవుతున్న వాతావరణం కనపడుతుందన్నారు. బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను ప్రశాంత వాతావరణంలో మరింత సంబురంగా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, కమిషనర్ సత్యనారాయణరెడ్డి తో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.