అడవిదేవులపల్లి, జనవరి 24 :ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తోడు పలువురు దాతలు కలిసివవస్తున్నారు. ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజాప్రతినిధులు మేము సైతం అని అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడవిదేవులపల్లి మండలంలోని మొల్కచర్ల ప్రాథమికోన్నత పాఠశాల విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, స్వచ్ఛత, ప్రయోగాలు, ఆంగ్ల మాధ్యమంలో ఆదర్శంగా నిలుస్తున్నది. అందులో ఉపాధ్యాయ బృందం కృషితో పాటు గ్రామస్తుల భాగస్వామ్యం ఎంతో ఉన్నది.
జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులు…
పాఠశాలలో స్వచ్ఛతకు పెద్దపీట వేశారు. పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మరుగుదొడ్లలో నల్లాలు బిగించడంతోపాటు సబ్బు అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు భోజనానికి ముందు సర్ఫ్ నీళ్లతో చేతులు కడిగిస్తారు. భోజనం తర్వాత కూడా చేతులు శుభ్రం చేయించి వృథా నీటిని పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలకు మళ్లిస్తారు. దాంతో పచ్చదనం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు అవార్డులు, రివార్డుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకే ఖర్చు చేయడం గమనార్హం.
దాతల సాయం..
పాఠశాల అభివృద్ధికి పలువురు దాతలు సాయం అందించారు. ముంగి బాలాజీ యాదవ్ రూ.30వేల విలువైన సోలార్ ఇన్వర్టర్ అందించారు. కుర్రా రత్నా, సపావట్ జగన్ రెండు వాటర్ ట్యాంకులు నిర్మించారు. ఇలా పలువురు దాతలు పాఠశాల అభివృద్ధికి తమకు తోచిన సాయం అందించారు.
కంప్యూటర్ విద్య…
పాఠశాలలో రోజు ఓ గంట కంప్యూటర్ బోధిస్తుంటారు. ప్రొజెక్టర్ ద్వారా బోధన కొనసాగుతుంది. దాంతో ప్రారంభం నుంచే విద్యార్థులు కంప్యూటర్ విద్యపై అవగాహన పెంచుకుంటున్నారు.