నార్కట్పల్లి, జనవరి 1 : అది టైర్ పంక్చర్ల దుకాణం.. భర్త ఒక్కడే చెమటోడ్చి పనిచేయడం ఆమెను కదిలించింది. కుటుంబం గడవడానికి తాను కూడా ఏదైనా పని చేయాలనుకుంది. కానీ, బయట ఎక్కడో పనిచేయడం కంటే భర్తకు పనిలో సహాయంగా ఉంటే చాలనుకుంది. టైర్లకు పంక్చర్లు వేయడం నేర్చుకున్నది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా పాతికేండ్ల అనుభవంలో భారీ వాహనాల టైర్లను సైతం అలవోకగా పంక్చర్లు వేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన స్వాతి.
నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి స్వామి, స్వాతి భార్యాభర్తలు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు ఉపాధి కోసం 25 ఏండ్ల కిందట నార్కట్పల్లికి వలస వచ్చారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు సరైన ఉపాధి లేకపోవడంతో నల్లగొండ క్రాస్ రోడ్డులో ఎన్జీబీ బ్యాంకు పక్కన చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని టైర్ల పంక్చర్ల దుకాణం పెట్టుకున్నారు. మగవారికి సైతం కష్టమైన పనిని స్వాతి అనతి కాలంలోనే నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 30, 40 కేజీల బరువుండే టైర్లను కూడా అలవోకగా మారుస్తున్నది. 25 ఏండ్లుగా భర్తకు దీటుగా బైక్లు, ఆటోలు, లారీ కంటైనర్లు, జేసీబీ సహా హెవీ వెహికిల్స్ టైర్లను మార్చడం, పంక్చర్లు వేయడం అలవోకగా చేస్తున్నది. భార్యాభర్తలిద్దరూ వృత్తిలో రాణిస్తూ మన్ననలు పొందుతున్నారు. ముగ్గురు కూతుళ్ల వివాహాలు చేశారు. కుమారుడిని చదివిస్తున్నారు. 25 ఏండ్లుగా ఇంటి పని చేసుకుంటూనే మిగిలిన సమయాల్లో దుకాణంలో పనిచేస్తున్నానని, మహిళలు కూడా అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించాలని చెప్తున్నది స్వాతి.