మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 12 : విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు డబ్బుపై ఉన్న అత్యాశతో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మిర్యాలగూడలో మంగళవారం వెలుగుచూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడేనికి చెందిన ఉమ్మడి వెంకట్రెడ్డి మిర్యాలగూడ నాగార్జున ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 2017లో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో కొందరు నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎస్టీబీసీ(సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి) సంస్థ్ధ ఆధీనంలో ఉన్న ఎయిడెడ్ స్కూల్స్, కళాశాలల్లో పోస్టులు ఉన్నాయని చెప్పాడు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎయిడెడ్ పోస్టుల భర్తీ జీఓను చూపి నిరుద్యోగులకు ఆశ కల్పించాడు. ఈ సంస్థ్ధ ఎడ్యుకేషనల్ చైర్మన్గా చెప్పబడుతున్న సీహెచ్ అంజనాప్రసాద్ ద్వారా ఒంగోలు, కర్నూలు, బాపట్ల, మార్కాపురం కళాశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.12లక్షల వరకు వసూలు చేశా డు. 25 మంది నుంచి సుమారు రూ.1.60 కోట్లు తీసుకున్న. అనంతరం 2017 జూలైలో పోస్టు ద్వారా సంస్థ పేరుతో 25 మందికి వెంకట్రెడ్డి ఆర్డర్(నకిలీ)కాపీలను పంపించాడు. కాపీ ప్రకారం అక్టోబర్ 3న సంబంధిత ప్రాంతాల్లో ఉన్న కాలేజీలో చేరాలని సూచించారు.
అక్టోబర్ 1న తిరిగి పోస్టు ద్వారా ఎయిడెడ్ కాలేజీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, జాయినింగ్ను తాత్కాలికంగా నిలిపివేశామని మరొక ఆర్డర్ కాపీని పంపించారు. అప్పటి నుంచి ఐదేండ్లుగా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ నిరుద్యోగులను నమ్మిస్తూ వచ్చాడు. 2021 మేలో బాధితులందరూ అంజనా ప్రసాద్, వెంకట్రెడ్డిని గట్టిగా నిలదీయడంతో వీరిద్దరి స్నేహితుడైనా విజయరామరాజు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి, 2021 సెప్టెంబర్ వరకు చూడండి, లేకపోతే అక్టోబర్ 10 నాటికి మీరిచ్చిన డబ్బులను తిరిగి ఇస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళనను విరమించారు. అయితే ఇచ్చిన గడువు తేదీ దాటిన తర్వాత సైతం సదరు వ్యక్తుల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితులు తమ వద్ద ఉన్న ఆర్డర్ కాపీలను నిజమా, కాదా అని తెలుసుకునేందుకు ఎస్టీబీసీ సంస్థను, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విచారణ చేయగా అవి నకిలీ లివి, అంజనా ప్రసాద్ లాంటి వ్యక్తి తమ సంస్థలో లేడని తెలుపడంతో బాధితులందరూ తాము మోసపోయామని గ్రహించారు. ఈ నెల 11న కొందరు బాధితులు మిర్యాలగూడ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన ప్రత్యేక టీం ప్రస్తుతం మెదక్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎయిడెడ్ లెక్చరర్గా పనిచేస్తున్న ఉమ్మడి వెంకట్రెడ్డిని పట్టుకోవడంతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన కామారెడ్డిలో నివాసం ఉంటున్న విజయ రామరాజును అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపారు. ప్రధాన నిందితుడు అంజనా ప్రసాద్ పరారీలో ఉన్నట్లు టూటౌన్ సీఐ సురేశ్కుమార్ తెలిపారు. కాగా బాధితుల్లో ఒకడు వెంకటేశ్వర్రెడ్డి కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా సదరు ఉపాధ్యాయులు 11 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.60 లక్షలను వసూలు చేశారు. వారు కూడా మోసపోయామని గ్రహించి ఇటీవల అక్కడి పోలీసులను ఆశ్రయించారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా మీ వద్దకు వచ్చి నమ్మించి డబ్బులు వసూలు చేసే వారిని నమ్మెద్దు. అలాంటి వారి వివరాలను తమకు తెలియజేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కొంతమంది మోసగాళ్లు ఉద్యోగాలను ఎరగా చూపి ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలంటూ నమ్మిస్తారని అలాంటి మాటలను నమ్మెద్దు. తమకు సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్రావు, డీఎస్పీ మిర్యాలగూడ