భువనగిరి కలెక్టరేట్, జూన్ 30 : గంజాయిని తరలిస్తున్న ముఠాను గురువారం చౌటుప్పల్ పరిధిలోని రెడ్డిబావి వద్ద పట్టుకున్నట్లు డీసీపీ కె. నారాయణరెడ్డి తెలిపారు. గురువారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ అంబేద్కర్ కాలనీకి చెందిన దూనం అరవింద్, ఒడిస్సా రాష్ట్రం మాలకాంగిరి జిల్లా నాగళూరుకు చెందిన పప్పుల తిరుపతితో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. వీరు ఒడిస్సా రాష్ట్రం పప్పులూరు మండలం కురుమనూరు గ్రామానికి చెందిన అప్పారావు వద్ద 28 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.
దానిని హైదరాబాదుకు చెందిన కాలె సాహెబ్కు విక్రయించేందుకు జూన్ 28 రాత్రి కారులో బయల్దేరారు. కారులో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు చౌటుప్పల్ సమీపంలోని రెడ్డిబావి క్రాస్రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో గంజాయిని తరలిస్తున్న అరవింద్, తిరుపతిలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 28 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, రూ.13,800 నగదు, షిఫ్ట్ డిజైర్ కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ పేర్కొన్నారు. అప్పారావు, కాలసాహెబ్పై కూడా కేసు నమోదు చేశామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఆయన తెలిపారు. సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్రెడ్డి, పోలీసు అధికారులు ఉన్నారు.