నీలగిరి, జూన్ 23 : పోటీ ప్రపంచంలో యువతకు ఆకాశమే హద్దు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన పోలీస్ నియామక ఉచిత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొని ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి చదువుకునే స్తోమత లేనందున వారి సౌకర్యార్థం ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
కోచింగ్ తీసుకున్న ఉద్యోగార్థులు ఉద్యోగం సాధించేంత వరకు సెల్ఫోన్, టీవీ, ఫ్రెండ్స్ మూడింటికి దూరంగా ఉండాలని సూచించారు. ఉచిత శిక్షణలో నేర్చుకున్న మెళకువలు పాటించి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కళలను నెరవేర్చాలని కోరారు. ఒక్కరోజులోనే ఎవరూ ప్రయోజకులు కారని, దాని కోసం కష్టపడాలని అప్పుడే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటామన్నారు. వీటన్నింటికి సరైన మార్గం చదువేనని అది మన చేతిలోనే ఉందన్నారు. దీంతోనే మనకు తగిన గుర్తింపు వస్తుందన్నారు.
స్థానికులకే ఉద్యోగాలు అందించే దిశగానే ప్రభుత్వం 317 జీఓ తెచ్చిందన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు తోకలేని కోత్తుల్లా ఎగిరాయని విమర్శించారు. ఈ జీఓతో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా మిగిలిన 5శాతంలో సైతం రాష్ట్రస్థాయి పోస్టులు లేకుండా మల్టీజోన్ వ్యవస్థ తేవడంతో అందులో సైతం మనకే ఉద్యోగాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ప్రతి అవకాశమూ తెలంగాణ యువతకే దక్కేలా అకుంటిత దీక్షతో సీఎం కేసీఆర్ నీళ్లు, నిధులు, ఉద్యోగాలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురుకులాలతో అందరికీ ఉచిత విద్యను తెచ్చిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు. తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత వచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ రాహుల్శర్మ మా ట్లాడుతూ శిక్షణ పొందిన ప్రతిఒక్కరూ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చదవాలన్నారు. శిక్షణ పూర్తయిందనే భ్రమలో గాక అంతకు రెండింతలు చదవాలని సూచించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వం 18వేల ఉద్యోగాల ప్రకటన చేయడంతో 1557 మంది అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షల్లో ఎంపిక చేసి వారికి రాత పరీక్ష నిర్వహించి 500మందిని ఎంపిక చేశామన్నారు. వీరు గాక ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి 233, గిరిజన సంక్షేమ శాఖ నుంచి 69, మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి ఏడుగురు అభ్యర్ధులను ఎంపిక చేసి రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చామని తెలిపారు. నిష్ణాతులైన ఇండోర్, అవుట్ డోర్ సిబ్బందితో అభ్యర్థులకు శిక్షణ నిర్వహించామన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నీళ్లు, నిధులు, నియమాకాలే లక్ష్యంగా ఉద్యమాన్ని చేపట్టి రాష్ర్టాన్ని సాధించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నీళ్లు, నిధులు తెచ్చారని, ప్రస్తుతం నియమాకాలపై దృష్టి సారించారని తెలిపారు. ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రతిఒక్కరూ ఉద్యోగాలే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, అడీషనల్ ఎస్పీ అశ్వక్, సంక్షేమ శాఖ అధికారులు రాజ్కుమార్, డీఎస్పీలు నర్సింహారెడ్డి, వెంకటరమణ, సీఐలు పాల్గొన్నారు.