యాదాద్రి, మే 27 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం శుక్రవారం సాయంత్రం కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాయం వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారిని పూలు, పట్టువస్ర్తాలతో దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం అమ్మవారిని ఊయలలో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలతో కొనియాడుతూ లాలిపాటలు పాడారు.
స్వయంభువుడికి నిత్యారాధనలను అర్చక బృందం తెల్లవారుజామున 3గంటల నుంచి ప్రారంభించింది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఉదయం 4గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. బిందెతీర్థం నిర్వహించి లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రాకార మండపంలోభ నిత్యతిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు.
కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామికి నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. స్వయంభువుల ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులతో సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చించారు. పాతగుట్ట ఆలయంలో నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు రూ.19,06,407 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి దర్శనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదయ్ ఉమేశ్ లలిత్ సతీసమేతంగా శనివారం రానున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయన్, నల్సా సభ్యుడు అశోక్ కుమార్ జైన్ స్వామిని దర్శించుకోనున్నారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,53,200
వీఐపీ దర్శనం 82,500
వేద ఆశీర్వచనం 13,800
నిత్యకైంకర్యాలు 4,401
సుప్రభాతం 2,400
క్యారీబ్యాగుల విక్రయం 3,000
వ్రత పూజలు 1,21,600
కల్యాణకట్ట టిక్కెట్లు 25,600
ప్రసాద విక్రయం 8,48,780
వాహనపూజలు 13,200
అన్నదాన విరాళం 57,588
శాశ్వత పూజలు 10,000
సువర్ణ పుష్పార్చన 1,07,748
యాదరుషి నిలయం 74,410
పాతగుట్ట నుంచి 37,080
కొండపైకి వాహన ప్రవేశం 2,50,000
లక్ష్మీపుష్కరిణి 1,000
గోపూజ 100