వేములపల్లి, మే 23: నల్లగొండ, యాదాద్రి భువ నగిరి జిల్లాల్లో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపెంట గ్రామానికి చెందిన చిట్యాల జానయ్య(35) గ్రామంలో కట్టింగ్ దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం తన దుకాణం శుభ్రం చేసి చెత్తను పార వేసేందుకు రోడ్డు వెంట నిలబడ్డాడు.
ఈ క్రమంలో సూర్యాపేట నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జానయ్య తలకు తీవ్ర గాయం కావడంతో 108లో మిర్యాలగూడ ప్రభు త్వ దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
యాదాద్రి : బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన యాదగిరిగుట్ట మండలంలో జరిగింది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకా రం.. రాజాపేట మండలంలోని సింగారం గ్రామానికి చెందిన బొల్లారం మహేందర్(48) యాదగిరిగుట్ట పట్టణంలో నివసిస్తున్నాడు. తన బైక్పై అత్తగారి ఊరు రాజాపేట మండలం నెమిల గ్రామానికి వెళ్లి తిరిగి గుట్టకు వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి మాసాయిపేట గ్రామ శివారులోని విద్యుత్ స్తంభానికి ఢీకొట్టాడు. దాంతో తలకు తీవ్ర గాయం కావడంతో అక్కకడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చిట్యాల : ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణ శివారులోని ఎన్గ్రీల్ హోటల్ వద్ద 65వ జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈవెంట్ స్టేజ్ సెటప్ మెటీరియల్ లోడ్తో టాటాఏస్ (ఆటో) హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు బయల్దేరింది. చిట్యాల పట్టణ శివారులోకి రాగానే ఆటో టైర్ పేలడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. అందులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108లో నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుతున్నట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు.