నాగార్జునసాగర్, కాళేశ్వరం, మూసీ మూడు నదుల నీటితో కళకళలాడిన సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ మండలం నేడు కరువు కోరల్లో చిక్కుకున్నది. ఈ మండలంలో 32వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగు నీరు అందక ప్రస్తుతం 22 వేల ఎకరాలకు పడిపోయింది. కాళేశ్వరం, నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఈ ప్రాంతంలో పెన్పహాడ్ మండలమే చివరిది కావడంతో నీళ్లు అందడం లేదు. దాంతో పొట్ట దశకు వచ్చిన పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైస్ఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పెన్పహాడ్ మండలంలో తవ్విన కాల్వలు దాదాపు 18 ఏండ్లుగా ఖాళీగా దర్శనమిచ్చాయి. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 405 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్పహాడ్ మండలానికి సాగునీటిని అందించింది. మరో పక్క నాగార్జునసాగర్, మూసీ జలాలు అందడంతో మూడున్నరేండ్లుగా పుష్కలంగా పంటలు పండాయి. మూడు నదులు పారే అవకాశం ఉన్న ఈ మండలంలో ఇప్పుడు కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం నీటికి కోత పెట్టడంతో పెద్ద ఎత్తున నష్టం చేకూరుతున్నది.
గతంలో కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలాలను ఆయకట్టు పరిధిలో వారబందీ ప్రకారం ఏడు రోజుల చొప్పున ఆరు విడుతల్లో అందించారు. 42 రోజులపాటు రోజుకు 2,500 క్యూసెక్కుల చొప్పున వారానికి 17,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రోజుకు 1800 చొప్పున వారానికి 10,800 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. వారానికి 6,500 చొప్పున ఆరు వారాలకు 39వేల క్యూసెక్కుల నీటికి కోత విధించడంతో శివారున ఉన్న పెన్పహాడ్ మండలంలోని భూములకు నీరు అందడం లేదు.
వానకాలం సీజన్ వరకు కాల్వల ద్వారా మండలంలో 32వేల ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ఈ సీజన్లో బావులు తవ్వి, బోర్లు వేసినా 22వేల ఎకరాలకు మించి సాగు కాలేదు. గతంలో కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ కాల్వల కింద భక్తళాపురం, ధర్మాపురం, చెట్ల ముకుందాపురం, గాజుల మల్కాపురం, చిన్నగారకుంటతండా, పెద్దగారకుంటతండా, ఎల్లప్పకుంటతండా, చిన్నసీతారంతండా, పెద్దసీతారంతండాల్లో సుమారు 17వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ సారి నీటి విడుదల తక్కువ ఉండడంతో బావులు, బోర్లు వేసినా 9వేలకు మించి సాగు కాలేదు. అవి కూడా పొట్ట దశలో ఎండిపోయే పరిస్థితి దాపురించింది.
సాగర్ ఆయకట్టు కింద నారాయణగూడెం, అన్నారం, నాగులపహాడ్ గ్రామాల్లో 1500 ఎకరాలు సాగు ఉండగా.. పెన్పహాడ్, అనంతారం, దోసపహాడ్, అనాజిపురం, పొట్లపహాడ్, అన్నారం, లింగాల, దూపాడ్, చీదెళ్ల, తంగెళ్లగూడెం, చెట్లముకుందాపురం గ్రామాల పరిధిలో సుమారు 11వేల ఎకరాలు సాగర్ లిఫ్ట్ల కింద బావులు, బోర్ల సహాయంతో వేసిన వరి పొలాలు పొట్ట దశకు చేరుకున్నాయి. సాగర్ నీటిని విడుదల చేయకపోవడం, మరో పక్క భూగర్భ జలాలు పడిపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
మూసీ జలాల ఆధారంగా అనాజిపురం, అనంతారం, సింగారెడ్డిపాలెంలో సుమారు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన పంటలు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. మొత్తం మీద 32వేల ఎకరాల సాగు భూమిలో 22వేల ఎకరాల్లో వరి నాట్లు వేస్తే 30 శాతం పంట చేతికి వస్తుందో లేదో ప్రశ్నార్థకంగా మారిందని రైతులు పేర్కొంటున్నారు. గతంలో నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీలో ఉన్నా జిల్లా మంత్రిగా ఉన్న గుంటకండ్ల జగదీశ్రెడ్డి నీటిని విడుదల చేయించి ఆదుకున్నారు. ఇప్పుడు జిల్లా మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి నాగార్జునసాగర్తోపాటు గోదావరి జలాల విడుదలను పెంచి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
ఎస్సారెస్పీ కాల్వ కింద నాకు, నా పిల్లలకు 12ఎకరాలు సాగు అయితుండె. మూడు సంవత్సరాలుగా, రెండు కార్లు సగం పత్తి, సగం వరి సాగు చేస్తున్నాం. ఈ సారి నీళ్లు వస్తాయో లేదోనని ఆరు ఎకరాల్లోనే వరి సాగు చేశాం. నాట్లు వేసి 45రోజులు అయ్యింది. గత వారంలో ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు వదిలిందని విన్నాం. కానీ.. మా దగ్గర ఉన్న ఎస్సారెస్పీ మెయిన్ కాల్వకు కూడా నీళ్లు చేరలేదు. మా ప్రాంత రైతులు నిరాశలో ఉన్నారు. మా బావి పూర్తిగా ఎండిపోయింది. మూడు బోర్లు ఉంటే ఆగి పోస్తున్నాయి. 6 ఎకరాల్లో ఎకరం పంట కూడా చేతికి వస్తుందో లేదో అనుమానం ఉంది. ప్రభుత్వం స్పందించి కనీసం వరుస తడులు నీళ్లిస్తే పంట చేతికి అందుతుంది. గిట్లనే ఉంటే మళ్లీ పాత రోజులు వస్తాయనే భయం పట్టుకున్నది.
– పందిరి అంజిరెడ్డి, రైతు, గాజులమల్కాపురం, పెన్పహాడ్ మండలం
కేసీఆర్ ప్రభుత్వం నాగార్జునసాగర్లో కొన్ని నీళ్లు ఉన్నా పంటలను కాపాడేందుకు నీళ్లిచ్చింది. ఆ ఆశతోనే ఎల్-27 లిఫ్ట్ కింద నాకున్న నాలుగెకరాల్లో రెండు బోర్లు వేసి వరి నాటేసిన. ఆ బోర్లు ఇప్పుడు ఎండిపోయాయి. దిక్కులేక కొద్దోగొప్పో డబ్బులు వస్తాయని పొట్టకు వచ్చిన పొలాన్ని గొర్రెల మేతకు ఇచ్చిన. మా ఊర్ల రైతులంతా బోర్లు, బావుల సహాయంతో నాట్లు వేస్తే సగం వరకు ఆశ వదులుకున్నారు. ప్రభుత్వం రెండు మూడు సార్లు సాగర్ నీటిని వదిలితే భూగర్భ జలం పెరిగి వేసిన పంటలు చేతికి వస్తాయి.
– బోడ జానయ్య, రైతు, అనంతారం, పెన్పహాడ్ మండలం