యాదగిరిగుట్ట, డిసెంబర్ 22 : వైకుంఠ ఏకాదశి రోజున మహా విష్ణువు గరుడ వాహన రూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలను ముస్తాబు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాదగిరి గుట్ట ఆలయాన్ని విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, పూలతో అలంకరించారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత రెండోసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి అన్ని సౌకర్యాలు కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ వేళల్లో స్వల్ప మార్పు చేసినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
వైకుంఠ ఏకాదశి రోజున మహా విష్ణువు గరుడ వాహన రూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలను ముస్తాబు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాదగిరి గుట్ట ఆలయాన్ని విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, పూలతో అలంకరించారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత రెండోసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి అన్ని సౌకర్యాలు కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ వేళల్లో స్వల్ప మార్పు చేసినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
వైకుంఠ ఏకాదశి వేడుకలను యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, పాతగుట్ట క్షేత్రం ముస్తాబయ్యాయి. శనివారం ఉదయం 6.48 నుంచి 8 గంటల వరకు ప్రధానాలయంలో స్వామివారు వైకుంఠనాథుడిగా ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. పాతగుట్ట(పూర్వగిరి) లక్ష్మీనారసింహస్వామి ఉత్తర రాజగోపురం గుండా ఉదయం 6.42 నుంచి 7.20గంటలకు దర్శనం ఇవ్వనున్నాడు. ఉత్సవాల్లో భాగంగా ప్రధానాలయంతో పాటు పాతగుట్టను విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, పూలతో ఆలంకరించిన్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. దీంతోపాటు ఈనెల 28 వరకు స్వామివారి అధ్యయనోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 6 రోజుల పాటు స్వామివారికి భక్తులచే నిర్వహించే ఆర్జిత పూజలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ వేళల్లో స్వల్ప మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. వైకుంఠనాథుడిని స్వామివారి దర్శించుకునేందుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జడంగె, న్యాయమూర్తులతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి, వరంగల్(పశ్చిమ) ఎమ్మె ల్యే నాయిని రాజేందర్రెడ్డి హాజరుకానున్నారు.
ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో స్వామివారి ఆధ్యయనోత్సవాలు నేటి నుంచి ఈనెల 28వ వరకు ఆరు రోజుల పాటు జరుగనున్నాయి. శనివారం ఉదయం గరుడ వాహనంపై వైకుంఠ నాథుడి ఆలంకార సేవ, సాయంకాలం మత్యావతారం విష్ణుమూర్తి అలంకార సేవ, 24న ఉదయం వేణుగోపాల స్వామి అలంకారం, సాయంకాలం గోవర్ధనగిరి దారి అలంకారం, 25న ఉదయం శ్రీరామావతార అలంకారం, సాయంత్రం వేంకటేశ్వర స్వామి అలంకార సేవ, 26న ఉదయం వెన్నకృష్ణుడు అలంకారం, సాయంత్రం కాళీయవర్ధనుడి అలంకారసేవ, 27న ఉదయం వటపత్రసాయి అలంకారం, సాయంత్రం వైకుంఠనాథుడి అలంకార సేవ(పరదపద ఉత్సవం), 28న ఉదయం నరసింహస్వామి అలంకార సేవ నిర్వహించి అధ్యయనోత్సవాలకు పరిసమాప్తం పలుకనున్నారు.
వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి
యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలో రెండోసారి స్వామి వారి ప్రధానాలయంలో ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీంతోపాటు ఆరురోజుల పాటు అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఆలయంలో భక్తులచే నిర్వహించే సుదర్శన నారసింహహోమం, నిత్య, శాశ్వత కల్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. పాతగుట్టలోనూ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తాం. వైకుంఠ ఏకాదశి వేడుకలకు ప్రముఖులు హాజరవుతారు.
– రామకృష్ణారావు, ఆలయ ఈఓ
ఉత్తర దిశగా వైకుంఠనాథుడి దర్శనం..
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయానికి ఉత్తర ద్వారం అద్భుతంగా నిర్మించగా నేడు స్వామివారు వైకుంఠనాథుడిగా దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఉత్తరాన ద్వితీయ ప్రాకారంలోని పంచతల రాజగోపురం 5 అంతస్తులతో నిర్మించగా ఉత్తర ద్వారాన్ని పూలు, అరటిమట్టలతో అలంకరించారు. ఉత్తర ద్వారం ఎదురుగా భక్తులు దర్శించుకునే విధంగా ప్రత్యేక స్టీల్ క్యూలైన్లు బిగించారు. వీవీఐపీ, వీఐపీలు, సాధారణ భక్తులు, మీడియాకు ప్రత్యేక గ్రిల్స్ను ఏర్పాటు చేశారు. భక్తవత్సలుడిగా సంకట హరుడిగా కోరిన కోర్కెలు తీరుస్తాడని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. 2023 సంవత్సరానికి మరో విశేషం ఉంది. ఈ ఏడాది జనవరి 2న స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శమివ్వగా, రెండోసారి ఈ నెల 23న దర్శన భాగ్యం కల్పించనున్నారు.
బ్రేక్ దర్శన వేళల్లో మార్పు..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ వేళల్లో మార్పులు చేశారు. స్వామివారి బ్రేక్ దర్శనం ఉదయం 9 గంటల సమయాన్ని మార్పు చేస్తూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అనుమతినివ్వనున్నారు. ఉదయం 3 గంటలకు స్వామివారి సుప్రభాతం, 3.30కు ప్రాతకాల తిరువారాధన, 4 నుంచి 4.30 గంటల వరకు ధనుర్మాసం తిరుప్పావై సేవ, ఉదయం 4.30 నుంచి 5.15గంటల వరకు బాలబోగం, 5.30 గంటల నుంచి ఆధ్యయనోత్సవాల్లో భాగంగా అలంకార సేవోత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు సర్వదర్శనాలకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు స్వామివారికి మధ్యాహ్న రాజభోగం నిర్వహించి అనంతరం స్వామివారి నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయి.