చౌటుప్పల్, ఏప్రిల్ 22 : సోషల్ మీడియా రీల్స్తో అభివృద్ధి జరగదని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం చౌటుప్పల్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యలపై ఎమ్మెల్యేకు ఏమాత్రం అవగాహన లేదన్నారు.
జనమే నీ ఒళ్లు పగులగొడతారు..
ఈ ప్రాంత సమస్యలపై తాను మాట్లాడితే ఒళ్లు పగులగొడతానంటూ ఎమ్మెల్యే మాట్లాడటం విచారకరమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత పాలకులదేనని కూసుకుంట్ల పేర్కొన్నారు. అలాంటి వాటి గురించి మాట్లాడితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పనులు చేయకపోతే జనమే మీ ఒళ్లు పగులగొడతారని హెచ్చరించారు. వంద మంది ప్రభాకర్ రెడ్లు వచ్చినా ఏమీ చేయలేరని అనడం కాదని.. ఒక్కడినే వస్తా ..దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో తాను రూ.576 కోట్లు తెచ్చి మొదలు పెట్టిన పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదని విమర్శించారు.15 ఏండ్ల నుంచి ఎంపీ,ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
మునుగోడును ఎంతో అభివృద్ధి చేశా..
కేసీఆర్ నాయకత్వంలో మునుగోడును తాను ఇతర నియోజకవర్గాల కన్నా ఎక్కువ అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. ఫ్లోరోసిస్ సమస్య నివారణ కోసం చౌటుప్పల్ వద్ద పైలాన్ పార్కు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. సాగునీటి కోసం చర్లగూడెం ప్రాజెక్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, వంద పడకల దవాఖాన తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్పై ఎమ్మెల్యేకు అవగాహన లేదని, ఏడాదిన్నరగా నిర్మాణ పనులను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దీనికోసం తాను కార్యకర్తలు, స్థానికులతో కలిసి ధర్నా చేసి, ఎన్హెచ్ఏఐ అధికారులను కలిశామని గుర్తు చేశారు. బస్స్టాండ్ వద్ద అండర్పాస్ నిర్మాణానికి అధికారులు సుముఖంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఎంపీని, మంత్రిని స్థానిక ఎమ్మెల్యే ఇక్కడకు తీసుకురాలేదన్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగం వదిలి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చానని, కాంట్రాక్టుల కోసం రాలేదని పేర్కొన్నారు.
అసెంబ్లీలో రైతు సమస్యలపై మాట్లాడని ఎమ్మెల్యే..
రైతు సమస్యలపై స్థానిక ఎమ్మల్యే అసెంబ్లీలో ఏనాడూ స్పందించలేదని మండిపడ్డారు. యూరియా కొరత, రైతు బంధు, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలను, ఆసరా పెన్షన్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇలాంటి సమస్యలపై తాను మాట్లాడితే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ముటుకుల్లోజు దయాకరా చారి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఉడుగు మల్లేశం గౌడ్, కౌన్సిలర్లు కొయ్యాడ శేఖర్ గౌడ్, ఊదరి యాదయ్య, నాయకులు దేవరపల్లి గోవర్దన్ రెడ్డి, ఉడుతల శ్రీశైలం, ఎం.సత్యనారాయణ గౌడ్, చెవ్వగోని మహేశ్ గౌడ్ ఉన్నారు.