నీలగిరి, జులై08 : నల్గొండ పట్టణంలో నూతనంగా నిర్మించిన బయో మైనింగ్ సైట్ను సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ లో ఏర్పాటు చేయనున్న బయో మైనింగ్ సైట్ ను మంగళవారం సంబంధిత ఏజెన్సీ నిర్వహకులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో జనాభా రోజు రోజుకు పెరిగిపోతున్నందున చెత్త కూడా అధికంగా వస్తుందన్నారు.
ఎప్పటికప్పుడు శుద్ధి చేసే ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అనంతరం బయో మైనింగ్ సైటుకు సంబంధించి కావాల్సిన సదుపాయాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ రవీందర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్, ప్రదీప్ రెడ్డి శ్రీనివాస్, డీఈ కార్తిజ్, ఏఈ ఆసిం బాబా, ఏజెన్సీ ప్రతినిధులు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.