సూర్యాపేట మున్సిపాలిటీలో ధర్మ గెలిచిందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. మున్సిపాల్టీలో చైర్పర్సన్, వైస్ చైర్మన్పై విపక్షాలు పెట్టిన ఆవిశ్వాసం వీగి పోవడంతో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పుట్ట కిశోర్తో కలిసి ఆమె మాట్లాడుతూ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి జనరల్ స్థానంలో ఎస్సీ మహిళకు అవకాశం కల్పించారన్నారు.
నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యే సహకారంతో కౌన్సిలర్లను కలుపుకొని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. విపక్ష నేతలు కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరింపులకు గురి చేసి అపవిత్ర కలయికతో అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. తనపై నమ్మకంతో దానిని వీగిపోయేలా చేసిన కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే సంవత్సరంలో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్పై పలువురు కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అధ్యక్షతన శనివారం మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు 144 సెక్షన్ విధించడంతో పాటు మున్సిపల్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు 11 గంటలకు మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణపై అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
అయితే కౌన్సిలర్లు ఒక్కరు కూడా హాజరు కాక పోవడంతో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కిశోర్పై అవిశ్వాసానికి 12 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించగా.. అందుకు కూడా కౌన్సిలర్లు రాక పోవడంతో తిరిగి 4 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 3 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, 4 గంటలకు వైస్ చైర్మన్ పుట్ట కిశోర్పై అవిశ్వాస తీర్మానాలకు ఓటింగ్ నిర్వహించగా కౌన్సిలర్లు ఒక్కరు కూడా రాక పోవడంతో సదరు అవిశ్వాస తీర్మానాలు వీగి పోయినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ ప్రకటించారు.