ఉత్తుత్తి మాటలకు, ప్రగల్బాలకు, లేని ఆడంబరాలకు మారుపేరైన నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి బొక్కబోర్లా పడ్డారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు దీటుగా అంటూ నల్లగొండలో బుధవారం కాంగ్రెస్ ప్రజా భరోసా సభను నిర్వహించి నవ్వులపాలయ్యారు. ముఖ్యనేతలు వచ్చే సమయానికి సభా ప్రాంగణం వెలవెలబోతూ కనిపించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గేను ఆహ్వానిస్తే.. ఆయనకు సభలో సగం వరకు ఖాళీ కుర్చీలే స్వాగతం పలికాయి. ఆయన ప్రసంగం ముగిసే సమయానికి ఐదారు వేల మంది కూడా సభలో లేకపోవడం గమనార్హం.
చివర్లో ప్రసంగించాలనుకున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన ప్రసంగానికి ముఖం చాటేయాల్సి వచ్చింది.
ఇక ఖర్గే ప్రసంగం ఏ మాత్రం ఆకట్టుకోకపోగా ఖాళీ కుర్చీలతోనే సభ కొనసాగింది. అసలు ఎందుకు ఈ సభ నిర్వహించినట్లు? నవ్వినోడి ముందు ఎందుకు బొక్కబోర్లా పడ్డట్లు? అని కాంగ్రెస్ శ్రేణులు అంతర్మథనంలో పడిపోయాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం సమయంలో ఉన్న జనానికి తమ అధ్యక్షుడు ఖర్గే ప్రసంగ సమయంలో ఉన్న జనానికి అస్మాన్ ఫరాక్ అని కాంగ్రెస్ నేతలు చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్22(నమస్తే తెలంగాణ) : సాధారణంగా ఒక పార్టీ అధినేతనో.. మరో ముఖ్య నేతనో ఒక అభ్యర్ధికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నాడంటే అది మరింత ఊపునిచ్చేదిగా ఉండాలి. విజయానికి ఎంతోకొంత దోహాద పడాలి. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్తేజాన్ని నింపాలి. కానీ నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో సోమవారం బీఆర్ఎస్ నిర్వహించిన సభాస్థలంలో అదే వేదిక మీద, అవే గ్యాలరీల నడుమ కోమటిరెడ్డి బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా భరోసా సభ అట్టర్ ప్లాపైంది. ఈ సభకు జనాన్ని ఓ మాదిరిగా తరలించినా అసలు సమయానికి సభా ప్రాంగణం ఖాళీ కావడంతో తలలు పట్టుకోవడం కాంగెస్ శ్రేణుల వంతైంది. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డికి మద్దతుగా కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
సీఎం కేసీఆర్ ప్రసంగం ముగిసే వరకు జనం కదలకుండా అలాగే శ్రద్ధగా ఆలకించారు. బీఆర్ఎస్ సభకు మధ్యాహ్నం 3 గంటలకే తరలివచ్చిన జనం సాయంత్రం 5.18 గంటలకు సభ ముగిసే వరకు ఎక్కడ కూర్చున్న వాళ్లు అక్కడే కదలకుండా శ్రద్ధగా కేసీఆర్ ప్రసంగాన్ని ఆసాంతం ఆలకించారు. ఈ సభకు భారీగా జనం హాజరు కావడంతో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విజయం ఖాయమన్న చర్చ సర్వత్రా మొదలైంది. దీన్ని జీర్జించుకోలేని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేని ఆడంబరాలకు పోయి బీఆర్ఎస్ నిర్వహించిన సభా స్థలంలోనే బుధవారం ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో బహిరంగ సభకు సిద్ధమయ్యారు. ఈ ప్రజా భరోసా సభకు మల్లిఖార్జున ఖర్గేతో పాటు రాష్ట వ్యవహారాల ఇన్చార్జి మణిక్రావుఠాక్రే, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి హాజరైనా జనం నుంచి స్పందన కరువైంది.
ముఖ్య అతిథిగా వచ్చిన మల్లిఖార్జున ఖర్గే ప్రసంగానికి ముందే జనం లేచి వెళ్లిపోయారు. ఆయన ప్రసంగం ప్రారంభించే సమయానికే సభా ప్రాంగణం దాదాపుగా ఖాళీ అయ్యింది. ఖర్గే ప్రసంగిస్తున్న సయమంలో జనం లేని సభ, ఖాళీ కుర్చీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. ఖర్గే సుమారు 25 నిమిషాల సమయం ప్రసంగానికి తీసుకోగా దాని తెలుగు అనువాదానికి మరో 15 నిమిషాలు పట్టింది. మొత్తం 40 నిమిషాల పాటు ప్రసంగం, దాని తెలుగు అనువాదం కొనసాగి పూర్తయ్యే సమయానికి సభా ప్రాంగణం పూర్తిగా ఖాళీ అయ్యింది. అక్కడక్కడా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే సభలో మిగిలారు.
సభలో జనం వెళ్లిపోతుండడాన్ని గమనిస్తున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాణిక్రావు ఠాక్రేతో ఖర్గే వైపు చూస్తూ తల పట్టుకోవడం కనిపించింది. కొసమెరుపు ఏటంటే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ మల్లికార్జున ఖర్గే మాట్లాడిన అనంతరం తాను 10 నిమిషాల పాటు నియోజకవర్గ అభివృద్ధిపై తన ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. కానీ తీరా ఖర్గే ప్రసంగం ముగిసే సరికే సభలో ఖాళీ కుర్చీలే మిగలడంతో వెంకట్రెడ్డి తన మ్యానిఫెస్టోను కూడా ప్రకటించలేకపోయారు. రెండు రోజుల తేడాతో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, కాంగ్రెస్ వెలవెలబోయిన సభ జనంలో చర్చనీయాంశంగా మారింది. లేని ఆడంబరానికి పోయి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన ఓటమిని ముందే ఖరారు చేసుకున్నాడన్న ఛలోక్తులు మొదలయ్యాయి.