నీలగిరి, జూలై 18 : రెండు తెలుగు రాష్ట్రాల్లో తాళాలు వేసిన ఇండ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 260 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి, లక్షన్నర నగదు, రెండు టీవీలు, రెండు సౌండ్ బార్స్, 5 బైక్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ చెప్పారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
భూష్మి శ్రీకాంత్ను సీసీఎస్ పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకొని రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. అతడి నేరచరిత్రను తెలుసుకునేందుకు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించారు. శ్రీకాంత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణలో 28, ఆంధ్రాలో 12 మొత్తం 40 చోరీలకు పాల్పడ్డాడు. ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన తమ్మిశెట్టి నాగరాజు, అల్లంశెట్టి సాయి కిరణ్ @ పాండు, సమంతపు వెంకట అశోక్, ఆలేటి కోటేశ్వర్ రావు, మండేపూడికి చెందిన సపావత్ నాగ కిరణ్ బాబు నాయక్, పెద కూరపాడు మండలం అంబేదర్ కాలనీకి చెందిన పిల్లి రాజేష్లను అరెస్టు చేశారు.
పిడుగురాళ్ల మండలానికి చెందిన గాడిబోయిన గోపి సాయి, తమ్మండ్ర రమేష్ పరారీలో ఉన్నారు. ఈ ముఠాను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, నిడమనూరు ఎస్ఐ విజయకుమార్, సీసీఎస్ ఎస్ఐ సురేశ్, సిబ్బంది విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాషా, ఫయాజ్, శివరాజ్, నరేష్, గులాం దస్తగిరి, కమల్ కిశోర్, సాయి, జునైద్, నాగరాణి ఆశ్రర్లను డీజీపీ అభినందించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రకటించారు.