రోగ నిరోధక శక్తి పెంపులో దివ్యఔషధంగా పని చేసే బత్తాయికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మండే ఎండల్లో మోసంబి జ్యూస్కు ఉండే క్రేజ్తో వినియోగం పెరుగడం రైతన్నకు కలిసివస్తున్నది. ప్రస్తుతం కత్తెర సీజన్ కాయ చేతికి వస్తుండగా, నాణ్యతను బట్టి టన్నుకు రూ.30వేల నుంచి 50వేల వరకు ధర పలుకుతున్నదని రైతులు, ఉద్యానవన అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి
నల్లగొండ జిల్లాలో 44వేల ఎకరాల్లో బత్తాయి సాగవుతుండగా, పంటను మార్కెట్కు తరలించాల్సిన పని లేకుండా వ్యాపారులే తోటల దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు. ఇక్కడి నుంచి ఏపీతో పాటు ఢిల్లీ, హర్యానా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు చెప్తున్నారు.
నల్లగొండ, మే 16 : కరోనా నేపథ్యంలో బత్తాయికి రెండేండ్లుగా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికీ కరోనా ఆనవాళ్లు ఉండడంతో పాటు వేసవి తీవ్రత కారణంగా జ్యూస్ల వినియోగం పెరిగింది. అయితే బత్తాయికి నాణ్యతను బట్టి టన్నుకు రూ.30 నుంచిరూ.50 వేల వరకు పలుకుతున్నట్లు అధికార యంత్రాంగం, రైతులు చెప్పుతున్నారు. ఈ సీజన్లో బత్తాయి పంట ధరలు గణనీయంగా పెరుగుతుండడంతో వ్యాపారులే తోట వద్దకు వచ్చి ఈ ధర పెడుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట ఉత్పత్తిలో 35 శాతం వరకు చేతికి అందుతుండగా ఈ పంటను రైతులు మంచి ధరలకు అమ్ముతున్నారు.
టన్నుకు రూ.50 వేల వరకు
సాధారణంగా బత్తాయి పంట ఏడాదికి మూడు సార్లు చేతికందుతుంది. ప్రతి ఏటా ఫిబ్రవరి , మార్చి నెలల్లో 10 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 35 శాతం, జూలై, ఆగస్టు నెలల్లో 55 శాతం పంట వస్తుంది. ప్రస్తుతం 35 శాతం పంట వస్తుండగా వచ్చిన పంటను రైతాంగం మంచి ధరకు విక్రయిస్తున్నారు. టన్నుకు నాణ్యతను బట్టి రూ.30 నుంచి రూ.50 వేల వరకు పలుకుతున్నది. గత వానకాలంలో పండించిన పంటను పూర్తి స్థాయిలోఅమ్ముకోలేక ఇబ్బంది పడిని రైతాంగం ఈ యాసంగి సీజన్ కాస్త ఊరటనిస్తున్నది. ఈ పంట ఉత్పత్తులను విక్రయించడానికి ఎక్కడికి పోకుండా తోట వద్దకే వచ్చి వ్యాపారులు ఈ రేటు పెట్టడం రైతుకు కలిసి వచ్చే అంశం.
ఇతర రాష్ర్టాలకు ఎగుమతి
బత్తాయి నల్లగొండ నుంచి ఇతర రాష్ర్టాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నది. పండిన పంటలో 70 శాతం మేరకు ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన ట్రేడర్లు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేసుకోని వెళ్లి ఆయా మార్కెట్లలో విక్రయిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 44 వేల ఎకరాల్లో సాగు..
ఒకప్పుడు బత్తాయి సాగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ సాగుయ్యేది నల్లగొండ జిల్లానే. కాలక్రమేణా వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గడంతో బత్తాయి సాగు క్రమంగా తగ్గింది. ప్రస్తుతం నీటి వనరులు పెరుగడంతో మళ్లీ బత్తాయి సాగు పెరిగింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో బత్తాయి 44వేల ఎకరాల్లో సాగు అవుతుండగా ఒక్క నల్లగొండ జిల్లాలోనే 42 వేల ఎకరాల్లో సాగు ఉన్నది. బత్తాయి ఎకరాకు ఎనిమిది నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుండగా అందులో ఈ కత్తెర సీజన్లో 35 శాతం పంట వస్తున్నది.
బత్తాయికి రేటు బాగా వస్తున్నది
ప్రస్తుతం కత్తెర సీజన్కు సంబంధించిన బత్తాయి పంటకు మార్కెట్లో మంచి ధర పలుకుతున్నది ఉంది. వ్యాపారులే రైతుల తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సన్న, చిన్న కారు రైతులు కొద్ది గొప్ప పంట ఉన్నప్పటికీ కూడా మార్కెట్లకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా తోట వద్దనే విక్రయిస్తున్నారు. పంట విక్రయించిన వెంటనే డబ్బులు చేతికందుతున్నాయి.
–సంగీత లక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి, నల్లగొండ