యాదాద్రి, ఆగస్టు 25 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి భక్తులచే నిర్వహించే మొక్కు బ్రహ్మోత్సవాన్ని అర్చకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకుంభస్థాపన, చతుస్థానార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరిపించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అనంతరం రథోత్సవ సేవ నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వాహన సేవలను మొక్కు బ్రహ్మోత్సవాల్లో నిర్వహించారన్నారు. కల్యాణోత్సవం కంటే వందరెట్ల పుణ్యఫలాన్ని అనుగ్రహించే ఉత్సవం మొక్కు బ్రహ్మోత్సవ సేవ అని తెలిపారు. భక్తులచే నిర్వహించే ఈ ఉత్సవాలు ఒకటి లేదా మూడు లేదా ఐదు రోజులు నిర్వహించబడుతాయని తెలిపారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో స్వామివారి సుదర్శన నారసింహ హోమం జరిపి స్వామి,అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తా బు చేసి గజ వాహన సేవ నిర్వహించారు.
స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనబాగ్యం కల్పించారు. వారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సమయంలో స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ, తిరువావరాధన ఘనంగా నిర్వహించారు. స్వయంభూ నారసింహుడికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేశారు. శ్రావణమాసం సందర్భంగా యాదగిరిగుట్టలో చేపట్టిన శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా కొనసాగుతున్నది. 28వ రోజు అర్చనలో పాల్గొన్న భక్తుల పేరిట సంకల్పం జరిపి అమ్మవారికి కుంకుమ ప్రసాదం, స్వామివారి మహాప్రసాదం అందించారు. శ్రావణమాసం కావడంతో భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.28,75,282 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
మొక్కు చెల్లించుకున్న భక్తులు
స్వామివారి మెట్లకు నిజామాబాద్ జిల్లాకు చెందిన భక్తులు కారంపూరి లలిత, మేఘన మొక్కు పూజలు చెల్లించుకున్నారు. కుటుంబసభ్యులు తీవ్ర ఆనారోగ్యానికి గురవడంతో స్వామివారి మొక్కుకున్నామన్నామన్నారు. అనారోగ్యం నుంచి కుటుంబసభ్యులు బయటపడడంతో స్వా మివారి 365 మెట్లకు పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు.
శ్రావణమాస పూజల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే దంపతులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా నిర్వహిస్తున్న ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గురువారం యాదాద్రి చేరుకున్న వారు మొదటగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనలో పాల్గొని ధ్వజస్తంభాన్ని దర్శించుకున్నారు. వెలుపలి ప్రాకారంలో ఈశాన్య మండపంలో నిర్వహిస్తున్న కోటి కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు అమ్మవారి కుంకుమ, మహాప్రసాదం అందించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు 30మంది రుత్వికులు, ప్రధానార్చక బృందం చతుర్వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అనుబంధ శివాలయంలో పరమశివుడిని, స్పటికలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా పునర్నిర్మించారన్నారు. ఇంతటి మహాకార్యానికి పూనుకున్న సీఎం కేసీఆర్ కారణజన్ముడని అభివర్ణించారు. దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శనానికి అనేక మంది భక్తులు వస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా నిలవబోతుందని చెప్పారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు ప్రజాగాయకుడు గద్దర్
యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. గురువారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిల్పకళా సముదాయంతో నిర్మించిన ఆలయాన్ని చూస్తుంటే మరో ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుందన్నారు. కులాలు, మతాలకతీతంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.