మిర్యాలగూడ, మే 17 : బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటివరకు నాలుగు సార్లు జరుగగా, నాలుగు పర్యాయాలు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారన్నారు. రాకేశ్రెడ్డి ఉన్నత విద్యావంతుడు అని, ఆయనకు పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యల పట్ల అవగాహన ఉందని తెలిపారు. రాకేశ్రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1.64లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిందని, మరో 30వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయగా ఈలోగా ఎన్నికలు రావడంతో ఫలితాలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసి ఆ ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రైవేట్ రంగంలో 20లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. పట్టభద్రులు రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరారు.
ఈ నెల 21న పట్టణంలోని టీఎన్ఆర్ గార్డెన్లో 2వేల మంది పట్టభద్రులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి అభ్యర్థి రాకేశ్రెడ్డితోపాటు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మోసిన్అలీ, జొన్నలగడ్డ రంగారెడ్డి, నారాయణరెడ్డి, బాబయ్య, కరుణాకర్రెడ్డి, మల్లేశ్గౌడ్, ఫయాజ్, రవీందర్, అంజయ్య పాల్గొన్నారు.