పెద్దఅడిశర్లపల్లి, అక్టోబర్ 21 : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే దేవరకొండ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో దేవరకొండ ఖిలాపై మరోమారు గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పీఏపల్లి మండలంలోని కోదండాపురం గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ను మరోమారు ఆశీర్వదించి అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో, మ్యానిఫెస్టో విడుదల చేయడంలో, ప్రచారంలో ఎలాగైతే ముందుందో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు, రైతుబంధు, ఉచిత కరెంటు, ఆసరా పింఛన్ వంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్ గ్యారెంటీ పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి దేవరకొండలో అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. తొమ్మిదేండ్ల కాలంలో దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోమారు ఎమ్మెల్యేగా తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు కోదండాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బిల్యానాయక్, ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, నాయకులు వల్లపురెడ్డి, నీలా రవికుమార్, ముచ్చర్ల ఏడుకొండలు, ముచ్చర్ల శ్రీకాంత్, శీలం శేఖర్రెడ్డి, మునగాల అంజిరెడ్డి, ముత్యంరావు, సర్వయ్య, టీవీఎన్.రెడ్డి పాల్గొన్నారు.