దేవరకొండ, జూన్ 5 : వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రగతి వేడుకలో ఆయన మాట్లాడారు. 60 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ విద్యుత్ సమస్యను పరిష్కరించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అవుతుందని, కరెంటు తీగల మీద బట్టలు అరేసుకుంటారని సమైక్య పాలకులు ఎద్దేవా చేసి, శాపనార్దాలు పెట్టారని తెలిపారు. కానీ.. వారి అంచనాలు తలకిందులు చేసి వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని చెప్పారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రాభాగాన నిలిచిందని తెలిపారు. ఉత్పత్తితోపాటు సరఫరాను మెరుగుపర్చుకొని రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో రూ.22,502 కోట్లతో సబ్స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లు ఏర్పాటు చేసి విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని, 4వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి మెగా పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు తుది దశకు చేరాయని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, ఎంపీపీలు మాధవరం సునీతాజనార్దన్రావు, వంగాల ప్రతాప్రెడ్డి, బాణావత్ పద్మాహనుమానాయక్, దూదిపాల రేఖారెడ్డి, జడ్పీటీసీలు కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి, కేతావత్ బాలూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెలుగూరి వల్లపురెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఉజ్జిని సాగర్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, నాయకులు, విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.