నీలగిరి, ఫిబ్రవరి 10 : తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసమమని, కృష్ణా నీటిలో మన వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం అంటే మన హక్కులను కోల్పోవడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఈ నెల 13న నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ రోడ్లో జరుగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్లగొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మాట్లాడుతూ 60 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ విధ్వంస పాలనను సరిచేస్తూ కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగిందన్నారు. కృష్ణా నీటిపై కేంద్రానికి అన్ని హక్కులు పోయి, ఆఖరికి మంచినీటిని కూడా మనం సొంతంగా వాడుకునే హకు ఉండదని తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. అనుభవం లేని ముఖ్యమంత్రి, మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, సీనియర్లు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోకుండా కేఆర్ఎంబీ మీద సంతకాలు చేశారని విమర్శించారు.
శాసనసభలో కూడా వాళ్లు మాట్లాడేది మాట్లాడి బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అవకాశం లేకుండా చేస్తూ నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ కోసం, తెలంగాణ హకుల కోసం కొట్లాడేది కేసీఆర్ మాత్రమేనని మరోసారి నిరూపితమయ్యిందని చెప్పారు. తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే ఆగం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అనుభవ లేమి, ప్రతీకార ధోరణి, కక్షపూరిత పద్ధతుల్లో సాగిస్తున్న పరిపాలన వల్ల ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుస్తుందన్నారు. తెలంగాణ హకులను ఇతరులకు తాకట్టు పెట్టే పద్ధతిలో వారి వ్యవహార శైలి సాగుతుందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరుగబోయే ప్రమాదాన్ని ప్రజలు, రైతులకు చెప్పాలనే నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ సభను నల్లగొండలో ఏర్పాటు చేస్తున్నందున, స్థానిక నాయకులు, రైతులు ఒక సవాలుగా స్వీకరించి పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్, కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి, నల్లగొండ నియోజక వర్గం పార్టీ పరిశీలకుడు,
వరంగల్ మాజీ మేయర్ రవీంద్ర సింగ్, మాజీ ఆర్ఓ శరణ్యారెడ్డి, కనగల్ ఎంపీపీ ఎసే కరీం పాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, నల్లగొండ మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బకరం వెంకన్న, తిప్పర్తి, కనగల్, నల్లగొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగోని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్రావు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు కమిటీలు అనుబంధ సంఘాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.