సూర్యాపేట, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్వన్నీ మోసపూరిత హామీలే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల మాయమాటలకు ప్రజలు మోసపోయారు. పాలనను గాలికొదిలేసి మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వీడియోల రూపంలో ప్రజలకు చూపించి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జగదీశ్రెడ్డి హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎనలేని వ్యతిరేకత చోటు చేసుకుందన్నారు. ఎన్ని మాయమాటలు చెప్పినా, కుప్పిగంతులు వేసినా మరోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, ఉమ్మడి నల్లగొండలో రెండు ఎంపీ సీట్లు బీఆర్ఎస్వేనని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు చేసిన ప్రసంగాలు, ఆ పార్టీ ఇచ్చిన హామీలే మన ఆయుధాలని బీఆర్ఎస్ శ్రేణులకు జగదీశ్రెడ్డి తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని, ఇప్పటికే ప్రజలు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను పూర్తి స్థాయిలో వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆత్మహత్యలు లేనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నటిస్తున్నదని, పలు కేసులతో వార్తలను సంచలనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని, కానీ పాలనపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు.
తప్పుడు సమాచారంతో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని, కొన్ని పత్రికలు ఇంతవరకు ఎక్కడా లేని విధంగా లీకేజీ వార్తలకు పాల్పడుతున్నాయని జగదీశ్రెడ్డి దుయ్యబట్టారు. 120 రోజులుగా కేసుల వార్తలు తప్ప మీడియాలో మరో వార్త రావడం లేదని, వాస్తవానికి కేసులు అయినా, నేరం జరిగినా, తప్పులు చోటు చేసుకున్నా ఆయా సంస్థలు విచారణ చేస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఒకటి పోతే మరో కేసు అంటూ కేసీఆర్పై బురద జల్లే కార్యక్రమమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకోసారి కేసీఆర్ను జైలులో పెడుతామని అంటున్నారని, కానీ ఏ కేసు కూడా కొసెల్లెడం లేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కనాడైనా, ఎవరినైనా జైలులో పెడుతామని అన్నామా? పాలన చేతగాక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి, మంత్రులు కాలం గడుతున్నారని విమర్శించారు.
మాజీ సీఎం కేసీఆర్ను తిట్టడమే కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా కొనసాగించలేని దుస్థితిలో ఆ ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ను తిడితే కాంగ్రెస్పై ప్రజలకు ఉన్న వ్యతిరేకత పోతుందా, ఇంకా ఎన్నాళ్లు ఇలా కాలం గడుపుతారని మండిపడ్డారు. పాలన తెలియకుంటే సీనియర్ నాయకులను అడగడమో, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులతో సంప్రదింపులు జరుపడమే చేయాలిగానీ గాలికి వదిలేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
డిసెంబర్ 9న హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పగా, ఇంతవరకు చేయలేదని అన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు ఊరుకున్నామని, ప్రజలకు ఇబ్బందులు కలిగితే సహించేది లేదని తెలిపారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుండడంతో రైతుల కష్టాలు తెలుసుకొని ఆత్మస్తైర్యం నింపేందుకు కేసీఆర్ పొలం బాట పడితే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అర్థం లేని ఆరోపణలు చేసి రైతుల్లో మరింత పలుచనయ్యారని చెప్పారు. రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదని, బీఆర్ఎస్కు ఇది కలిసి వచ్చే విషయమని తెలిపారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమైనట్లేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీలు జీడి భిక్షం, సంజీవ్నాయక్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజకీయ చరిత్రలో అతి తక్కువ సమయంలో ప్రజల్లో ఆదరణ కోల్పోయి హామీలు అమలు చేయని ప్రభుత్వంగా కాంగ్రెస్ నిలిచింది. కాంగ్రెస్ సర్కారు దివాళాకోరు తనంతో అత్యధికంగా ప్రమాదంలో పడిన వర్గం రైతాంగం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఎన్నో ఆశలతో ఓటు వేసిన యువత, మహిళలు, పించన్దారులు నేడు మోసపోయామనే భావనలో ఉన్నారు. మరోమారు ఇలాంటి తప్పిదం చేయబోమని చెప్తున్నారు. కాంగ్రెస్కు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదు.
– ఒంటెద్దు నర్సింహారెడ్డి, ఉన్నత విద్యామండలి మాజీ సభ్యుడు
సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పథంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీళ్లు లేక, అభివృద్ధి జరుగక ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతాన్ని మళ్లీ ఎడారిగా మార్చాలనే దురుద్దేశంతో ఆ పార్టీ ఉన్నట్లు కనిపిస్తున్నది. నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయకపోవడం, కాళేశ్వరాన్ని పట్టించుకోకపోవడమే ఇందుకు ఉదాహరణ. కాంగ్రెస్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే అభివృద్ధికి చిరునామా అయిన బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలి. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలంతా ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో నల్లగొండ వాణిని వినిపిస్తా. పెద్ద ఎత్తున నిధులు తెచ్చి గతంలో మాదిరిగా అభివృద్ధిని కొనసాగిస్తా.
-కంచర్ల కృష్ణారెడ్డి, నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పేరుకు ఇద్దరు మంత్రులు ఉన్నారు. నీళ్ల మంత్రి ఉన్నా ఎండిపోతున్న పొలాలకు చుక్క నీరిప్పించలేదు. రోడ్ల మంత్రి ఉన్నా ఒక ప్యాచ్ వర్క్ కూడా చేయించలేదు. అసమర్థ మంత్రులుగా ప్రజల ముందు మిగిలిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాలో ఒకే ఒక మంత్రి జగదీశ్రెడ్డి ఉండి వేల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. నేడు ఏ పట్టణం, ఏ పల్లెకు వెళ్లినా నాడు చేసిన ప్రగతి పనులు సాక్షాత్కరిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టింది. కనీల మొక్కలకు నీళ్లు పోయించలేని దుస్థితి ఆ పాలకులది. సూర్యాపేటతోపాటు పలుచోట్ల వ్యాపారులు, అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అవినీతికి పాల్పడే వారికి ఓట్లడిగే అర్హత లేదు.
-బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు