యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడడం ఒక్క కేసీఆర్, గులాబీ జెండాతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. భువనగిరిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే దున్నపోతు మీద వాన పడ్డట్టేనని, రాష్ర్టాన్ని పట్టించుకునే నాథుడే ఉండరని అన్నారు.
ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అంటున్నారని, పొరపాటున గెలిపిస్తే.. హామీలు అమలు చేయకున్నా ప్రజలు మద్దతు పలికారని చెప్పుకొని పూట గడుపుతారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ఆయన సిరిసిల్ల పర్యటకు వెళ్తే భయపడి, కాళేశ్వరం జలాలను తెల్లారే విడుదల చేశారని చెప్పారు.
బీజేపీకి ఓటేస్తే కాంగ్రెస్కు వేసినట్లేనని, బీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మద్దతు తెలిపినట్లేనని అన్నారు. కేసులకు బీఆర్ఎస్ భయపడదని, రేవంత్ రెడ్డికి 50వేల మంది పోలీసులు ఉండొచ్చని, కానీ కేసీఆర్కు 50లక్షల గులాబీ సైన్యం ఉన్నదని చెప్పారు. బీజేపీ గుజరాత్ మోడల్ అని గొప్పలు చెప్పుకొంటున్నదని, గుజరాత్ మోడల్ అంటే ఊచకోత, హింస, రేప్లు, రేప్లు చేసినోళ్లను జైలు నుంచి విడుదల చేయించడమేనని, ఇది తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. రెండు రాష్ర్టాల మధ్య నీటి సమస్యలపై బీజేపీ ఒక్క సారి కూడా స్పందించలేదని మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మళ్లీ 2014 కంటే ముందున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రతి రోజూ దొంగతనాలు జరుగుతుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘20 రోజుల నుంచి మంత్రి కనిపించకుండా పత్తాలేరు. విద్యుత్ లోఓల్టేజీతో మోటర్లు కాలిపోతున్నాయి. పంటలు ఎండుతుంటే ఎక్కడ ఉన్నావ్..? రైతులు నీ లాగులు పీకుతారని రావడం లేదా..?’ అని దుయ్యబట్టారు.
కేడర్ ప్రజల్లోకి వెళ్లాలని, గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులను చేయాలని జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, మోసం చేసిన తీరును ఎండగట్టాలని సూచించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇస్తే కాంగ్రెస్కు ఓటేయాలని, ఇవ్వకుంటే బీఆర్ఎస్ ఓటేయాలనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. విద్యార్థులకు రూ. 5లక్షల కార్డు ఇస్తామని వంచన చేశారని, గ్రామాల్లో ప్రచారానికి వస్తే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే కాంగ్రెస్ హామీలను ముక్కి పిండి అమలు చేయిస్తారని చెప్పారు. క్యామ మల్లేశ్ మంచి వ్యక్తి అని, ఆయనను పార్లమెంట్కు పంపిస్తే ప్రజల కోసం నిరంతర పోరాడుతారని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నర్సింహారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, నాయకులు మాడ్గుల ప్రభాకర్రెడ్డి, బీరు మల్లయ్య, మొగుల్ల శ్రీనివాస్, అతికం లక్ష్మీనారాయణగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ భువనగిరి పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీల ఓంప్రకాశ్గౌడ్, నాయకులు దిడ్డికాడి భగత్, ర్యాకల శ్రీనివాస్, బోయిని నర్సింహ, నాగారం సూరజ్, ఆయా మండలాల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ నాలుగు నెలలు గడిచినా ఏం చేయాలో తెలియని ఆయోమయ పరిస్థితిలో సర్కారు ఉంది. ఒక పక్క ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, మరో పక్క ఎండుతున్న పంటపొలాలు, వడగండ్లతో పట్ట నష్టం, కరెంటు కష్టాలు, వడ్ల కొనుగోలు చేయకపోవడం వంటివాటితో రైతులు, ప్రజలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. అలాంటి కాంగ్రెస్ను మళ్లీ గెలిపించి మరింత కష్టాన్ని తెచ్చుకుందామా.. కష్టాలు కడతేర్చిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామా.. అనేది మీరే ఆలోచించి ఓటు వేయాలి.
కాంగ్రెస్కు ఒక సిద్ధాంతంగానీ, ఒక ఐడియాలజిగానీ లేదు. తన కుర్చీ ఎవరు లాక్కుంటారోననే భయంతో రేవంత్రెడ్డి ఉన్నాడు. కేసీఆర్ పాలనలో గత పది సంవత్సరాలు కరెంట్ పోలేదు, ఒక్క మోటర్ కాలిపోలే, ఒక్కదొయ్య ఎండిపోలే. మరి ఇప్పుడెట్ల ఎండుతున్నాయో, కాలుతున్నాయో రైతులు పూర్తిగా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. నన్ను గెలిపిస్తే గతంలో ఏం జరిగిందో, నేనేం చేస్తానో చూపిస్తా. ఒక్క అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.. ఇతర పార్టీలు గెలిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది.. ఏది కావాలో ఆలోచించి ఓటు వేయాలి.
– క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలి. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసేకుంటూ ముందుకు సాగాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. పదేండ్లలో గ్రామాలు, పట్టణాల్లో జరిగిన ప్రగతి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తెలియజెప్పాలి. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే జరిగే అభివృద్ధిని వివరించాలి.
– పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ వచ్చిన తర్వాతే అన్ని రంగాల ప్రజలకు ఇబ్బందులు వచ్చినాయి. బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ప్రాంతం మళ్లీ అభివృద్ధి చెందుతుంది. ఎంపీ సీటు గెలిపించుకోవడంతోపాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలో గెలుపు దిశగా దూసుకెళ్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ ఒక రోజు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోలేదు. పరిషరించే దశలో ముందుకెళ్లలేదు. బీఅర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించాలి. మండల, గ్రామ స్థాయి కమిటీలకు పూర్తి బాధ్యతలు అప్పగించి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించాలి.
– ఎలిమినేటి సందీప్ రెడ్డి, జడ్పీ చైర్మన్
ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలి. 100 రోజులు గడిచినా ఇచ్చిన హామీలను పకన పెట్టి మళ్లీ ఎన్నికలకు ఎలా వస్తున్నదో నిలదీయాలి. మాజీ సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు ఆరు ఎంపీ సీట్లు ఇస్తే, కాంగ్రెస్ ఒక సీటు కూడా ఇవ్వలేదని ప్రజలకు తెలియజేయాలి. ప్రజలే పూర్తిగా మేము మోస పోయామని తెలుసుకొని కాంగ్రెస్కు కర్రు కాల్చి పెడుతారు. ఉమ్మడి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులకే సీట్లు కావాలని పోటీ పడుతున్నారు తప్ప, అభివృద్ధిని, ప్రజా సమస్యల పరిషారాన్ని పట్టించుకోవడం లేదు. గతంలో గెలిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం వరకే సరిపోయాడు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే బీఅర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించాలి.
– బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే
బీఅర్ఎస్తోనే గత పది సంవత్సరాలుగా ప్రజలు లబ్ధి పొందారు. రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, రైతులు, వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది అభివృద్ధి చెందారు. బీఅర్ఎస్ పార్టీ గెలువాలంటే పల్లె ప్రజలదే ప్రధాన పాత్ర ఉంటుంది. మాజీ సీఎం కేసీఆర్ రైతును రాజు చేయాలనుకుంటే, రేవంత్రెడ్డి రాహుల్ను రాజు చేయలనుకుంటున్నాడు. కాంగ్రెస్ వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మహిళలకు రూ. 2,500 లేవు, రూ.2లక్షల రైతు రుణమాఫీ లేదు. జాతీయ పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి జరుగదు. అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం.
– చింతల వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
భువనగిరి ప్రాంతం బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి చెందుతుంది. గతంలో గెలిచిన ఎంపీ అభ్యర్థులు ఏనాడూ ఈ ప్రాంత అభివృద్ధిపైగానీ, ప్రజా సమస్యలపైగానీ చర్చించలేదు. పరిష్కరించడానికి ముందుకు రాలేదు. ఒకరేమో ఎంపీగా గెలిచి ఈ ప్రాంతాన్ని మరిచిపోయిన వ్యక్తికి టికెట్ ఇస్తే, మరో పార్టీనేమో సస్పెండ్ చేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి, పార్టీకి కట్టుబడి ఉండడానికి పనిచేస్తారు తప్ప ప్రజా సమస్యలు, ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేయరు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంతాభివృద్ధి కోసం సేవ చేయడానికి పరిమితమవుతాడని, అలాంటి వ్యక్తి క్యామ మల్లేశ్ని గెలిపించాలి.
-కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు