నార్కట్పల్లి, నవంబర్ 30 : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఆదాయ వనరులు సమకూరే విధంగా నార్కట్పల్లి ఆర్టీసీ బస్స్టేషన్లోని ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలను నిర్మిస్తామని ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ పురుషోత్తమ్ నాయక్ అన్నారు. బుధవారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి నార్కట్పల్లి బస్స్టేషన్ పరిధిలో ఖాళీ స్థలాలను, రోడ్డు వెంట ఫుట్పాత్ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఈడీ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ చైర్మన్ ఆదేశాల మేరకు స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు.
నార్కట్పల్లి పట్టణాన్ని ఆధునీకరించేందుకు ఆర్టీసీ సంస్థకు చెందిన 2 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్తో ఏసీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడుతానన్నారు. రహదారి వెంట షాపింగ్ కాంప్లెక్స్ను కూడా నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే చొరవతో పట్టణ ప్రజలకు ఉపాధి కలిగే విధంగా త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీకి ఆదా యం సమకూరితే డిపోను భవిష్యత్లో పునరుద్ధరిస్తామన్నారు. డిపోకు బస్సుల సంఖ్య పెంచాలని స్థానికులు విన్నవించారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, ఆర్ఎం వరప్రసాద్, ఈసీ చెన్నకేశవులు,డీఈ సత్యనారాయణ,సీఐ లావణ్య, అసిస్టెంట్ మేనేజర్ నాగశ్రీ, ఎంపీటీసీ ముత్తయ్య, శ్రీధర్, విష్ణుమూర్తి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.