రామగిరి, ఫిబ్రవరి 14: మహాశివరాత్రిని పుర స్కరించుకొని పానగల్ ఛాయా సోమేశ్వరాలయం లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఛాయా సోమేశ్వరాలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లను ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, వివిధ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమెల్యే మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. బారికేడ్స్, శానిటరీ, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి వసతి కలిపించాలన్నారు. ఈనెల 17న సాయంత్రం నల్లగొండ రామాలయం నుంచి దేవాలయం వరకు నగరోత్సవాన్ని వివిధ కళారుపాలతో అద్భుతంగా నిర్వహించాలన్నారు. నగరోత్సవ ఖర్చును పూర్తిగా తానే భరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పోలీసుశాఖ ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాలన్నారు.
అదే విధంగా రూ. 123 కోట్లతో తర్వలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయని ఉదయ సముద్రం, పచ్చల, ఛాయా సోమేశ్వర, వేంకటేశ్వర ఆలయాల అభివృద్ధి, శిల్పారామం, తీగల వంతేనతో ఈ ప్రాంతమంతా అద్భుతంగా రూపుదిద్దుకోబోతుందన్నారు .అనంతరం శివ రాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, జయచంద్రారెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.