మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 14 : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళలకు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు శనివారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వేషన్ అయినందున జనరల్ స్థానంలో బీసీ మహిళకు కేటాయించి బీసీలకు న్యాయం చేయాలని, గతంలో కూడా జనరల్ స్థానంలో అగ్రవర్ణాలకే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రెండింటిని కేటాయించి బీసీలను మోసం చేశారన్నారు. కావున జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలకే మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో 48 వార్డుల్లో సగానికి పైగా బీసీలు గెలుపొందారని, కావునా జనాభా దామాషా ప్రకారం బీసీలకు మున్సిపల్ చైర్మన్ ఇవ్వాల్సిందేనన్నారు.
గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బీసీలకు చైర్మన్ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలన్నారు. నలగొండ జిల్లాలో కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అన్ని పదవులు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు అనుభవిస్తున్నారని కనీసం చైర్మన్ లాంటి పదవులు అయినా బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం పట్టణ కార్యదర్శి దోనేటి శేఖర్, యువజన నాయకులు ఎస్పీ నాయుడు, రామకృష్ణ, నరేష్, రోహిత్, రవి, గోపాల్, వెంకటేష్, లవన్, క్రాంతి, శేఖర్, రమేష్, రాములు, సురేందర్, లక్ష్మీ, సుధా, అనురాధ, జ్యోతి, శ్వేత, రాధా, మహేశ్వరి పాల్గొన్నారు.