నల్లగొండ, అక్టోబర్ 16 : నల్లగొండ బత్తాయి మార్కెట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం ఎంతో ఆర్భాటంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తమ మేలు కోరి మార్కెట్ను అందుబాటులోకి తెచ్చారని రైతులు సంతోషడే లోపు అదంతా హంబక్ అని తెలిసి తెల్లబోయారు. ప్రారంభించిన అర గంటకే కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేయడంతో అందరూ ఖంగు తిన్నారు.
అసలు సెంటరే లేని ప్రాంతంలో మినీ మాక్సీ వాహనంలో నాలుగైదు క్వింటాళ్ల పత్తిని తెప్పించి కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి ఫొటోలకు ఫోజులు ఇచ్చి.. పత్తి రైతులను బురిడీ కొట్టించారు. నల్లగొండ జిల్లా కేంద్ర శివారులోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు మంత్రులు హాజరు అవుతున్నారని ఒకరోజు ముందే అధికారులు ఫ్లెక్సీలు, ప్రకటనలు హోరెత్తించారు.
బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రంతోపాటు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇద్దరు మంత్రులు ప్రారంభించి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కనగల్కు చెందిన రైతు తాను తీసుకొచ్చిన పత్తిని తిరిగి మినీ మాక్సీ వాహనంలో వేసుకుని తీసుకువెళ్లాడు. కేవలం పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం కోసమే తీసుకువచ్చాడని తెలిసి రైతులు ముక్కున వేలు వేసుకున్నారు.
అప్రూవల్ రాకుండానే ప్రారంభించేశారు!
నల్లగొండ జిల్లాలో 24 జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పత్తి కొనుగోలుకు టెండర్లు వేశాయి. వాటికి సంబంధించి ఇప్పటి వరకు సీసీఐ యంత్రాంగం ఇన్స్టాలేషన్ చేయకుండా పెండింగ్లోనే ఉంచింది. వారి పని పూర్తయితే గానీ మార్కెటింగ్ యంత్రాంగం అప్రూవల్ ఇవ్వదు. కొనుగోలు కేంద్రాల ఎంపిక సీసీఐ దగ్గర పెండింగ్లో ఉండగా, మంత్రులు మాత్రం ఉత్తుత్తి కేంద్రం ప్రారంభించి పత్తి కొనుగోలు చేస్తున్నట్లు షో చేయడం విడ్డూరం.