పెద్దవూర, జనవరి 19 : ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలుపడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పని చేస్తున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అన్నారు. మండలంలోని పులిచర్ల గ్రామం లో ఎస్బీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశం, వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందించడమే వికసిత్ భారత్ లక్ష్యమన్నారు.
దేశంలోని 6.50 లక్షల గ్రామాల్లోకి వికసిత్ భారత్ వెళ్తుందని తెలిపారు. మోదీ హయాంలో తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో ఎయిమ్స్ నిర్మించామని, జాతీయ రహదారులు 2500 నుంచి 5వేల కిలోమీటర్లకు పెంచామని, రైల్వే లైన్లు రెట్టింపు చేశామని చెప్పారు. పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. దేశ వ్యాప్తంగా 2కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడం ప్రధాన మంత్రి లక్ష్యమని ప్రకటించారు.
ఆయుష్మాన్ భారత్ కింద పేదలందరికీ రూ.5లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రశాంత్ కిశోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం బరియార్, రీజినల్ మేనేజర్ అలీముద్దీన్, జిల్లా నోడల్ అధికారి శ్రామిక్, నాబార్డు జిల్లా మేనేజర్ వినయ్కుమార్, ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వర్రావు, డీఆర్డీఓ కాళిందిని, డీఎంహెచ్ఓ డాక్టర్ కొండల్రావు, మిర్యాలగూడ ఆర్డీఓ చెన్నయ్య, ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి అధికారులు పాల్గొన్నారు.