సూర్యాపేట : సీజన్ అడ్వాన్స్తో రైతులు ప్రకృతి వైపరీత్యాలకు చెక్ పెట్టవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రకుమార్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్. మోహన్రావు తో పాటు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా లో296 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా 20 కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తి కావడం కేంద్రాలను మూసి వేసినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,00, 105.640 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా 1,84,690 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి రూ. 412.21 కోట్ల అవుతుండగా రూ. 185.44 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. ఇంకా రూ. 226.77 కోట్లు జమ చేయాల్సి ఉందని చెప్పారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం విషయంలో మిల్లర్లు అభ్యంతరాలు తగదని మంత్రి చెప్పారు. రవాణా విషయంలో జాప్యంలేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఎం సివిల్ సప్లయ్ రాంపతినాయక్, డీఏఓ రామారావునాయక్ పాల్గొన్నారు.