బొడ్రాయిబజార్, మే 16 : గత ఎన్నికల్లో మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే రూ.6,350 కోట్లతో అభివృద్ధి చేశానని, ఇందులో 3 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయగా, మిగతా వాటితో సంక్షేమ పథకాలు అమలు చేశానని, నేను చేసిన అభివృద్ధి మీ ఊరిలో, మీ వాడలో, మీ ఇంట్లో చూస్తే కనిపిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని 1వ వార్డు కుడకుడలో రూ.19.80 లక్షలతో సీసీ రోడ్డు, 4వ వార్డు రాంకోటితండాలో రూ.20లక్షలతో అంతర్గత సీసీ డ్రైనేజీ నిర్మాణం, 8వ వార్డు ఇందిరమ్మ కాలనీ-2లో రూ.48.50 లక్షలతో అప్రోచ్ రోడ్ నిర్మాణం, 27వ వార్డులో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, 43వ వార్డు నెహ్రూనగర్లో రూ.20 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, 14వ వార్డు వినాయకనగర్లో రూ.19.85 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. ఎవరి కాలంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయి, ఎవరి హయాంలో ప్రజలు అనుకున్న అభివృద్ధి జరిగింది, ప్రజలందరికీ ఉపయోగపడే పనులు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో గుర్తించాలన్నారు. మనం వేసిన ఓటు మనకేమిచ్చిందని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. నాకు వేసిన ఓటుతో బ్రహ్మండమైన అభివృద్ధి చేశానని, నా మార్క్ ప్రతి ఇంటిలో కనబడుతుందని, ఈ మార్పు మీ ఓటుతోనే వచ్చిందన్నారు.
2014, 2018 ఎన్నికల్లో వేసిన ఒకే ఒక్క ఓటు సూర్యాపేటను జిల్లా కేంద్రంగా మార్చడమే కాకుండా, సూర్యాపేట రూపురేఖలనే మార్చి వేసిందన్నారు. అదే ఓటు సూర్యాపేటకు మెడికల్ కలాశాల తెప్పించిందని, సద్దులచెరువు, పుల్లారెడ్డి చెరువులను మినీ ట్యాంక్బండ్లుగా మార్చిందన్నారు. మీరు వరుసగా రెండు ఎన్నికల్లో వేసిన ఓటే పట్టణ సుందరీకరణకు దోహదపడిందన్నారు. నేడు సూర్యాపేట రోల్మోడల్ రూపుదిద్దుకుంటుందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అభిమానంతో వేసిన ఓటే అన్నది గుర్తుంచుకోవాలన్నారు. నాయకుడి పనితనానికి అభివృద్ధి గీటురాయని మంత్రి స్పష్టం చేశారు. సూర్యాపేట గురించి చెప్పుకోవాల్సి వస్తే 2014కు ముందు, తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. పట్టణ సుందరీకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మండుటెండను సైతం ఖాతరు చేయకుండా పట్టణమంతా కలియతిరుగుతూ జనంలో ఒకరిగా మమేకమై ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించారు మంత్రి జగదీశ్రెడ్డి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జడ్పీటీసీ సంజీవనాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, ఉప్పల ఆనంద్, పెద్దగట్టు మాజీ చైర్మన్ కడారి సతీశ్యాదవ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు, కౌన్సిలర్లు వేములకొండ పద్మ, లక్ష్మీమకత్లాల్, సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ, పగిళ్ల సుమీలాగన్నారెడ్డి, నామా అరుణ, రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి, ఎలిమినేటి అభినయ్, జహీర్, సిరివెళ్ల శబరి, గంగ లింగారెడ్డి, గుండపనేని కిరణ్ పాల్గొన్నారు.