Jagadish reddy | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు రాజకీయాలు ముఖ్యం కాదని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రం అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెప్పారు. ఆ సంకల్ప సిద్ధి కోసం రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన ఆ రూ.18,000 కోట్లను మునుగోడు అభివృద్ధికి ఇవ్వాలన్నారు. అలా చేస్తే ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవడానికి ఇప్పటికీ సిద్ధమేనన్నారు. తాము విసిరిన సవాల్కు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్పందించాలని జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని ఇప్పర్తి, జక్కలివారి గూడెం, రాయిగూడెం తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలసి ప్రచారం నిర్వహించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మునుగోడు ఎంపీపీ లింగస్వామి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, జడ్పీటీసీ స్వరూప రాణి రవీందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు బహిరంగ సభల్లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.
దక్షిణ తెలంగాణలో ప్రాపకం కోసమే కదా బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని మంత్రి జగదీష్రెడ్డి దుయ్యబట్టారు. కుట్రలు కుతంత్రాలతో బీజేపీ తెచ్చిన ఉప ఎన్నికలో వారు ఆశించింది నేర వేరాలంటే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన రూ.18,000 కోట్లు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చిస్తే దక్షిణ తెలంగాణలో బీజేపీకి ఒక సీటు కావాలన్న ఆశనెరవేరుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరినట్లుంటుందని చెప్పారు. ఆరు దశబ్దాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం సస్యశ్యామలంగామారడంతోటే బీజేపీకి ఈ దుర్బుద్ధి ఏర్పడిందని విరుచుకుపడ్డారు. ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా, వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతుబందు పథకంతో ఎకరాకు రూ.5 వేలు చొప్పున సాలీనా రూ.10 వేలు, రైతుబీమాతో ముఖ్యమంత్రి కేసీఆర్కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే బీజేపీ ఈ కుట్రలు కుతంత్రాలకు పాల్పడి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని మండిపడ్డారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇస్తున్న ఫించన్ రూ.600 మాత్రమే ఉండగా.. ఇక్కడ ఇస్తున్న ఆసరా ఫించన్లు, ఇక్కడి కల్యాణలక్ష్మి / షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు బీజేపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్నాయని జగదీష్రెడ్డి విమర్శించారు. గుజరాత్ లో వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్ కేవలం 6 గంటలేనని, ఆ అరు గంటలు కుడా ఉచితం కాదని, నిలబెట్టి మీటర్ రీడింగ్ సరిపడా వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు. అటువంటి రాష్ట్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ డిమాండ్ తీవ్రం కావడంతో ఇక్కడ కూడా మోటర్లకు మీటర్లు పెట్టేందుకు విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రత్యేక చట్టాన్ని మన మీద రుద్దెందుకు రూట్ మ్యాప్ రెడీ చేసిందన్నారు. అటువంటి పార్టీకి మునుగోడు ఉపఎన్నికను వేదికగా చేసుకుని గుణపాఠం చెప్పాలని ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.