మునుగోడు, సెప్టెంబర్ 13 : ‘గులాబీ జెండాతో ఒక్కడిగా బయల్దేరి, ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్కు కోట్లాది మంది టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మద్దతు ఉంది. కొత్త ఎజెండాతో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్తో కలిసి మనమంతా ముందుకు పోదాం’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని తెలిపారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిన తెలంగాణవైపు యావత్ దేశం చూస్తున్నదన్నారు. తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే, మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో 6 గంటలు మాత్రమే ఇస్తున్నారని, అందులో 6 నిమిషాలు కూడా ఉచితంగా ఇవ్వడం లేదని స్పష్టంచేశారు. రాజగోపాల్రెడ్డికి ఓటేస్తే మన బాయికాడ మోటర్లకు మీటర్లు పడ్డట్టేనని హెచ్చరించారు. అనంతరం మునుగోడు, జమస్తాన్ పల్లికి చెందిన 300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ కర్నాటి స్వామి ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు.
మునుగోడు / మర్రిగూడ / చండూరు, సెప్టెంబర్ 13 : రాష్ర్టానికి టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మొక్కవోని ధైర్యంతో రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విశ్వసించిన ప్రజలు రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టారన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, మర్రిగూడ, చండూరు మండలాల్లోని కార్యకర్తలతో మంగళవారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
మర్రిగూడ మండలంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24గంటల ఉచిత కరెంట్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యపడ్డాయన్నారు.
100శాతం సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి ఈ పథకాలు పుట్టుకొచ్చాయన్నారు. ఈ పథకాలు కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తున్నాడా అని ప్రచారం చేసే సన్నాసులకు కార్యకర్తలు గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని ఆయన లేకపోతే రాష్ట్రం వచ్చేదే కాదన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాతంలో రెండు భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టిందన్నారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు ఆదరణ పెరిగిందని ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను ఓర్వలేకనే ప్రధాని మోదీ రాష్ట్రంపై పగబట్టాడని విమర్శించారు. సంక్షేమ పథకాలు అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందన్నారు. పొరుగు రాష్ర్టాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రైతులు తెలంగాణలో గుంటెడు జాగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. కొత్త రాష్ట్రంలో సాధ్యపడిన 24గంటల ఉచిత విద్యుత్ గుజరాత్లో ఎందుకు సాధ్యపడదని రైతులు అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్నారు. కేసీఆర్ దమ్మున్న నేత అని, ఆయన్ని అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలుగా మనం గర్వపడాలని రాష్ర్టాన్ని సాధించిన సైనికులమే మనమన్నారు. ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతు టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నా రు. అనంతరం జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. సమావేశంలో ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్యాదవ్, సహకార చైర్మన్లు పి.యాదయ్య, బాలం నర్సింహ, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేశ్గౌడ్, దళిత బంధు మెంబర్ ఎల్.నర్సింహ, నాయకులు ఐతగోని వెంకటయ్యగౌడ్, పి.రాములు, ఊరిపక్క నగేశ్, నల్ల యాదయ్య, కల్లు నవీన్రెడ్డి, కుంభం మాధవరెడ్డి, నున్సావత్ సక్కుబాయి, రాపోలు యాదగిరి, కొల్కులపల్లి యాదయ్య, పి.పాండుగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
గట్టుప్పల్లో..
చండూరు మండలంలోని గట్టుప్పల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సమ్మేళనంలో ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్, చెరుపల్లి భాస్కర్, గొరిగె సత్తయ్య, సర్పంచ్ వీరమళ్ల శ్రీశైలం పాల్గొన్నారు.
మునుగోడులో…
మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళనంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, వైస్ ఎంపీపీ అనంత వీణ, స్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాజుల అంజయ్యగౌడ్, సర్పంచులు గుర్రం సత్యం, పంతంగి పద్మ, భిక్షమయ్య, ఎంపీటీసీలు బొడ్డు శ్రావణి, ఈద నిర్మల, ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీశ్, గుర్రం అంజయ్య, బొడ్డు నాగరాజుగౌడ్, పాల్గొన్నారు.