విద్యా ప్రమాణాలు పెంచి వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేసిందని, మన ఊరు- మనబడితో కొత్తరూపు సంతరించుకుంటున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం చివ్వెంల మండల కేంద్రంలో మన ఊరు-మనబడి కార్యక్రమంలో ఆధునీకరించిన ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో సర్కారు బడి వద్దన్న రోజులు పోయి ప్రస్తుత పరిస్థితులను చూసి సర్కారు బడి మాత్రమే కావాలి అనే రోజులు వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి బెంచీపై కూర్చొని విద్యార్థులతో ముచ్చటించారు. పుస్తకాలు, నోట్ బుక్స్ పరిశీలించారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో పూర్తయిన మన ఊరు-మన బడి స్కూళ్లను ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, లింగయ్య, భాస్కర్రావు, భూపాల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, భగత్కుమార్ ప్రారంభించారు.
చివ్వెంల, ఫిబ్రవరి 1 : సర్కారు బడి వద్దు అన్న రోజులు పోయి మాకు ప్రభుత్వ విద్యనే కావాలనే రోజులొచ్చాయని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు విద్యారంగంపై ఉన్న ప్రేమే నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ‘మన ఊరు మన బడి’లో భాగంగా మరమ్మతులు చేసిన మండల పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని బుధవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఒక్కతరం చదివితే ఆ సమాజానికి తిరుగులేదని నమ్మి సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,289 కోట్లతో పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రూ.117కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
తెలంగాణా పుట్టి ఎనిమిదేండ్లే కానీ 75 యేండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో వేలు పెట్టి చూపే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డీఈఓ అశోక్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్ నాయక్, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్రెడ్డి, సర్పంచ్ జూలకంటి సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మారినేని సుధీర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు రౌతు నర్సింహారావు, ఎంఈఓ గోపాల్రావు, హెచ్ఎం సాయిరెడ్డి పాల్గొన్నారు.
అధ్యాపకుడిగా మారి చిన్నారులతో మమేకమై…
మన ఊరు మన బడిలో భాగంగా తరగతి గదులను ప్రారంభించిన మంత్రి అనంతరం అధ్యాపకుడిగా మారారు. చిన్నారుల బెంచీపై క్చూని వారి పుస్తకాలు పరిశీలించారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు చెప్పారు. ఇష్టంగా చదువాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో రూ.80లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, పశువుల దవాఖానను మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు.