మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకొనే బోనాల పండుగ ప్రత్యేకమైనదని, బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేటలో వైభవంగా ఊర ముత్యాలమ్మ తల్లి బోనాల జాతర నిర్వహించారు. అమ్మవారికి డప్పు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాల మధ్య పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. మంత్రి జగదీశ్రెడ్డి ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. స్వరాష్ట్రంలో అన్ని పండుగలను ఐక్యతతో ప్రశాంతంగా జరుపుకొంటున్నామని, ఇది మనం సాధించుకున్న ఘనత అని తెలిపారు.
సూర్యాపేట టౌన్, ఆగస్టు 7 : బోనాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలని, ఆషాడం, శ్రావణ మాసాల్లో అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఊర ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీర్వచనంతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళలు బోనమెత్తి శివసత్తుల నృత్యాలు, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే బోనాల పండుగ తెలంగాణ ఐక్యతను చాటి చెబుతుందన్నారు. సమైక్య పాలనలో అన్ని రంగాలతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు సైతం ఆదరణ కరువైందన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్రమంతా ఒకరోజు సెలవు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆషాడ, శ్రావణ మాసాల్లో ఆయా ప్రాంతాల సంప్రదాయాల ప్రకారం గురు, ఆదివారాల్లో నిర్వహించుకుంటున్న బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బోనాలు ఎత్తుకున్న చిన్నారులు, మహిళలు మంత్రి జగదీశ్రెడ్డితో సెల్ఫీలు దిగారు. బోనాల పండుగ సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలిరాగా శివసత్తులు నృత్య విన్యాసాలతో సందడి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, టీఆర్ఎస్ నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్, మారిపెద్ది శ్రీనివాస్, కౌన్సిలర్లు ఆకుల కవితాలవకుశ, తాహెర్పాషా, బత్తుల లక్ష్మీజానీయాదవ్, వల్దాస్ సౌమ్యాజాని, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.