మేళ్లచెర్వు, ఫిబ్రవరి 22 : ఎద్దుల పందేల నిర్వహణతో వ్యవసాయ రంగానికి ఎంతో ఉత్సాహం లభిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మేళ్లచెర్వు మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న జూనియర్స్ విభాగ ఎద్దుల పందేలను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి, కిశోర్కుమార్తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరమ శివుడి ఆశీస్సులతో ఆలయంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని, వచ్చే ఏడాది నాటికి ఎద్దుల పందేల నిర్వహణకు స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.పందేలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను, తెలంగాణ నుంచి కాకుండా ఏపీ, కర్ణాటక నుంచి వచ్చి పోటీల్లో పాల్గొంటున్న రైతులను ఆయన అభినందించారు. ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ జాతరలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున పందేలు నిర్వహించి కోటి రూపాయల దాకా బహుమతులు అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా న్యూ కేటగిరి, సబ్ జూనియర్స్ విభాగ ఎద్దుల పందేల్లో ప్రథమ బహుమతి విజేతకు మంత్రి చేతుల మీదుగా బుల్లె ట్ బహూకరించారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ ఫైనల్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శివవిష్ణువర్దన్శర్మ, ధనుంజయశర్మ ఆయన ఆలయ మర్యాదలతో ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ శంకర్రెడ్డి,ఈ ఓ కొండారెడ్డి , ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వర్రా వెంకట్రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.