Suryapet | బొడ్రాయిబజార్, జూన్ 24 ;సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ సాగర సోయగాలను తలపిస్తున్నది. చెరువులో ఇటీవల బోటింగ్ ఏర్పాటు చేయగా.. పట్టణ ప్రజలు బోటు షికారు చేస్తూ చెరువు అందాలను ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన లైటింగ్ కొత్త అందాన్ని తీసుకొచ్చింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బోటు షికారుకు వచ్చే ప్రజలతో చెరువు ప్రాంతం కిటకిటలాడుతున్నది. రోజుకు 400నుంచి 500 మంది వరకు బోటింగ్ చేస్తున్నారు.
త్వరలో మరిన్ని బోట్లు గతంలో బోటింగ్ కోసం నాగార్జునసాగర్, లక్నవరం వంటి ప్రాంతాలకు వెళ్లిన పర్యాటక ప్రేమికులు ఇప్పుడు సూర్యాపేట పట్టణంలోనే బోటు షికారు చేస్తున్నారు. నాడు సద్దుల చెరువు కట్ట వెంట నడిచేందుకు భయపడిన ప్రజలు.. నేడు నడి చెరువులో బోటు షికారు చేస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. ఇటీవల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి బోటింగ్ ప్రారంభించగా.. నిత్యం ప్రజలతో చెరువు ప్రాంతం కిటకిటలాడుతున్నది. సద్దుల చెరువులో షికారు చేసేందుకు రూ.50లక్షలతో 13బోట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో 2 స్పీడ్, 5 పెడస్టల్, 4 షికారు, 2 పెద్ద బోట్లు ఉండనున్నాయి. ప్రస్తుతం ఒక స్పీడ్ బోటు, ఒక పెద్దది, ఒక పెడస్టల్ బోటు చెరువులో షికారు చేస్తున్నాయి. మిగతా బోట్లు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్పీడ్ బోటులో ట్రిప్పునకు రూ.350, పెద్ద బోటులో చిన్నారులకు రూ.30, పెద్దలకు రూ.50, పెడస్టల్ బోటులో ఒకరికి రూ.50 చొప్పున చార్జీలు నిర్ణయించారు.
మినీ ట్యాంక్బండ్ సుందరీకరణకు రూ.33.42కోట్లు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల చెరువును రూ.33కోట్లా 42లక్షలతో మినీ ట్యాంక్బండ్గా సుందరీకరించారు. నాడు కంపచెట్లతో నడిచేందుకు వీలు లేని చెరువు కట్టను జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో సర్వాంగ సుందరంగా, పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఈ సద్దుల చెరువు సుందరీకరణలో భాగంగా మిషన్ కాకతీయ నిధులు రూ.16కోట్లా 32లక్షలతో చెరువులో పూడిక తీసి కట్ట నిర్మాణం చేశారు. డీఎంఎఫ్టీ నిధులు రూ.4కోట్లా 5లక్షలతో కట్ట చుట్టూ రెయిలింగ్, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ నిధులు కోటీ 20లక్షలతో సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్, మొక్కల పెంపకం, డ్రిప్ ఇరిగేషన్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. బోదన్ విల్లా చెట్లను నాటారు. సీఎస్ఆర్ నిధులు రూ.9.20కోట్లతో చెరువు కట్టపై గ్రీనరీ, గ్రావెల్ ఫార్మేషనరీ, బోటింగ్, గన్నీ బోటింగ్తోపాటు చెరువు పక్కన రోడ్డు వెడల్పు, రెస్టారెంట్, పిల్లలు ఆడుకునేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. రూ.కోటీ 70లక్షలతో చెరువు మధ్యలో పైలాన్ నిర్మాణం చేయనున్నారు. ఇటీవల మున్సిపాల్టీ వారు రూ.50లక్షలతో బోటింగ్ ఏర్పాటు చేయగా టూరిజం వాళ్లు స్వాధీనం చేసుకొని నడిపిస్తున్నారు.
ఆనందంగా ఉంది
ఆహ్లాదం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఇక్కడే సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్లో బోటింగ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. స్నేహితులతో కలిసి బోటింగ్కు వచ్చి ఎంజాయ్ చేశాను. బోటు ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. సూర్యాపేటను ఆహ్లాదకర పట్టణంగా తీర్చిదిద్దిన మంత్రి జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు.
– ఇర్ఫాన్, సూర్యాపేట పట్టణం