– ఎంజీయూ ఔట్సోర్సింగ్ నియామకాలపై విచారణ చేపట్టాలి
– జీవో 97ను రద్దు చేయాలి
రామగిరి, సెప్టెంబర్ 03 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఎంజీయూ బీఆర్ఎస్వీ విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థి ప్రతినిధులు కలిసి వేరువేరుగా వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ వ్యవస్థలో వచ్చిన జీవో నంబర్ 97 కారణంగా నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలను ఈ సందర్భంగా వారు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
– మూడేళ్ల డిప్లొమా కోర్సును యథావిధిగా కొనసాగించాలి
– ఈసెట్ (ECET) ద్వారా బీటెక్ లేటరల్ ఎంట్రీ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వాలి
– ఎస్బీటీఈటీ (SBTET) పరిధి, ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలపై నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాలి
– విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 97ను తక్షణమే ఉపసంహరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్ నియామకాల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కేటీఆర్కు వినతిపత్రం సమర్పించారు. నియామకాల్లో పారదర్శకత పాటించలేదని, రోస్టర్ విధానం అలాగే ప్రభుత్వ నిబంధనలను విస్మరించారనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలన్నింటిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు విద్యార్థి ప్రతినిధులు తెలిపారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం తమ పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్ యూనియన్ నాయకులు అనుముల సురేశ్, ఎంజీయూ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

కేటీఆర్కు ఎంజీయూ, పాలిటెక్నిక్ విద్యార్థుల వినతి