యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 5 : పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రతీర్థ స్నానం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కల్యాణం.. రథోత్సవంతో అలసిపోయిన స్వామివారికి చక్రతీర్థ సేవ నిర్వహించి శృంగార డోలోత్సవానికి సిద్ధం చేశారు. స్వామివారికి నిత్యారాధనల అనంతరం పారాయణికులచే చతుర్వేద పారాయణాలు, యాజ్ఞికులచే నిత్య హవనం, మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు చేశారు. అనంతరం మహా పూర్ణాహుతి మహోత్సవాన్ని పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం చక్రతీర్థ మహోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యాజ్ఞాచార్యులు, అర్చక బృందం, పారాయణికులు ఘనంగా నిర్వహించారు. భక్తులు జై నారసింహ.. జైజై నారసింహ అంటూ జయజయ ధ్వానాలు చేస్తూ స్వామి చక్రతీర్థ స్నానాన్ని తిలకించారు. శ్రీదేవీ, భూదేవీ సమేతంగా లక్ష్మీనరసింహ స్వామి చక్రాళ్వార్తో కలిసి మంత్రపూర్వక స్నానం గావించారు.
నేడు అష్టోత్తర శతఘటాభిషేకం
పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 10గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1గంటకు మహదాశీర్వచనం, పండిత సన్మాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.
శ్రీపుష్పయాగం, డోలారోహణం
పాతగుట్టలో ఆదివారం సాయంత్రం 6గంటలకు శ్రీపుష్పయాగం, డోలారోహణం, దేవతా ఉద్వాసనను ఘనంగా నిర్వహించారు. లక్ష్మీనరసింహుడి ఉత్సవాలకు ఆహ్వానించిన ఆయా దేవతలను ఆయా మంత్రములతో ఆహ్వానించిన పిదప తిరిగి వారి స్వస్థలాలకు సంప్రదాయగా పంపించే దేవతా ఉద్వాసన వేడుక ఘనంగా నిర్వహించారు. భగవానుడి నామాలతో అర్చన వేడుకలు నిర్వహించే ప్రక్రియను శ్రీపుష్పయాగం పాంచరాత్రగమశాస్త్ర రీతిలో చేపట్టారు. సహస్ర నామాలతో అమ్మవారిని, భగవానుడిని పుష్పాలతో ఆరాధించారు.