యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఆళ్వార్ దివ్యప్రబంధ అధ్యయన మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం ఉదయం స్వామివారు వేణుగోపాల స్వామిగా, సాయంత్రం గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పండితులు, రుత్వికులు తిరుప్పావై మహోత్సవం, నవకలశాభిషేకం, మూలమంత్ర హోమం నిర్వహించి పాశురాలను పఠించారు.
యాదాద్రి, జనవరి 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో ఆళ్వార్ దివ్యప్రబంధ అధ్యయన మహోత్సవాలు శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి రోజున ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి ప్రభాతవేళ తిరుప్పావై మహోత్సవం, నవ కలశాభిషేకం, మూలమంత్ర హోమం జరిపారు. ఉదయం స్వామివారిని వేణుగోపాలస్వామిగా అలంకరించి పురప్పాట్ సేవలు చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పండితులు, రుత్వికులు ప్రత్యేకంగా పాశురాలను పఠించారు. ప్రధానాలయ తిరుమాఢవీధుల్లో ఊరేగించారు.
హుండీల ఆదాయం రూ.2,12,16,700
లక్ష్మీనరసింహస్వామి వారి 20 రోజుల హుండీ ఆదాయం రూ.2 కోట్లు దాటినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించామని, నగదు 2,12,16,700 రూపాయలు వచ్చినట్లు చెప్పారు. 167 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 600 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు వివరించారు.
స్వామివారి సేవలో ఆర్బీఐ మాజీ గవర్నర్..
స్వామివారిని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత వేణుగోపాల్రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ ఈఓ కార్యాలయంలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు స్వామివారి ప్రసాదం అందజేశారు.
సాయంత్రం గోవర్ధనగిరిధారిగా..
స్వామివారి స్వయంభూ ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం సాయంత్రం శీస్వామివారి ద్రావిడ ప్రబంధ సేవకాలాన్ని పారాయణీకులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ వేడుకల్లో ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, డీఈఓ దోర్బాల భాస్కర్శర్మ, అర్చకులు, పారాయణదారులు, వేద పండితులు పాల్గొన్నారు.
యాదాద్రిలో నిత్యోత్సవాలు
యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు వైభవంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, తిరువారాధన, సహస్రనామార్చనలు జరిపారు. ఆలయ ముఖ మండపంలో పలు దఫాలుగా సువర్ణపుష్పార్చనలు నిర్వహించారు. సాయంత్రం ముఖ మండపంలో సువర్ణమూర్తులకు దర్బార్, తిరువీధి సేవోత్సవం చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి తిరుప్పావై నిర్వహించారు. స్వామివారి ఖజానాకు రూ. 21,04,668 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
భారీగా విదేశీ కరెన్సీ…
స్వామివారి హుండీలకు విదేశీ కరెన్సీ భారీగా వచ్చింది. గతంతో పోలిస్తే ఈ సారి ఎక్కువగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆమెరికా డాలర్లు 1,194, యూఏఈకి చెందిన 140 దిరామ్లు, ఆస్ట్రేలియాకు చెందిన 150 డాలర్లు, ఇంగ్లాండ్కు చెందిన 30 పౌండ్లు, కెనడాకు చెందిన 45 డాలర్లు, ఒమన్కు చెందిన 10,500 బైసాలు, సింగపూర్కు చెందిన 74 డాలర్లు, మల్లేషియాకు చెందిన 60 రింగింట్లు సమకూరినట్లు ఈఓ గీత వివరించారు.