నిడమనూరు, మార్చి 25 : మండలంలోని ఎర్రబెల్లి లింగమంతుల స్వామి జాతర వైభవంగా జరుగుతున్నది. సోమవారం తెల్లవారు జామున మాణిక్యాల దేవి, లింగమంతుల స్వామి కల్యాణోత్సవాన్ని యాదవులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రెండేండ్లకోసారి నిర్వహించే జాతరలో భాగంగా తెల్లవారుజామున లింగమంతుల స్వామికి యాటలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డోలు వాయిద్యాల నడుమ కత్తులు, కటార్లతో యాదవులు గజ్జెలాగులతో నృత్యాలు చేశారు.
శివ సత్తుల పూనకాలు.. ఓ లింగా.. ఓ లింగా అంటూ నామస్మరణతో గట్టు పరిసరాలు మార్మోగాయి. జిల్లా నలుమూలల నుంచే గాక ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. జాతర సందర్భంగా భక్తులకు తాగు నీటి కొరత ఏర్పడి ఇబ్బంది పడ్డారు. దీనికితోటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఎర్రబెల్లి లింగమంతుల స్వామిని ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.