నల్లగొండ, మార్చి 21 : అర్హత లేని వారికి అవుట్ సోర్సింగ్లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. ల్యాబ్లు లేని దగ్గర పోస్టింగులు.. స్థానిక అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు సంబంధం లేకుండా నియామకాలు.. ఇదీ నల్లగొండలోని మహాత్మాజ్యోతీరావు పూలే విద్యా సంస్థల్లో ఇటీవల జరిగిన ఉద్యోగ నియామకాల తంతు. కనీసం బైపీసీ అర్హత ఉండాల్సిన నిబంధనను విస్మరించి స్థానిక ప్రిన్సిపాళ్లతో జిల్లా యంత్రాంగం చేతులు కలిపి పది, ఇంటర్ చదివిన వారికి రాష్ట్ర అధికారుల నిబంధన ప్రకారమే భర్తీ చేస్తున్నామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర రెండేసి లక్షలు వసూలు చేశారనే విమర్శలను మూటగట్టుకుంది.
కనీసం నోటిఫికేషన్ లేకుండా, జీఓ విడుదల చేయకుండా గతంలో ఈ గురుకుల విద్యా సంస్థలకు కేటాయించబడిన ఏజెన్సీ నిర్వాహకులకు సంబంధం లేకుండా పోస్టులు భర్తీ చేయడం విశేషం. ఈ విషయంపై విచారణ చేసి బీసీ గురుకుల యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు బుధవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి. అయితే జిల్లాలో 18 బీసీ గురుకులాలు ఉండగా, అందులో 17 ల్యాబ్ అసిస్టెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేసిన అధికారులు మాత్రం మాకు సంబంధం లేదు, అంతా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే చేశామని చెప్పి చేతులు దులుపుకోవడం గమనార్హం.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను వసతి సౌకర్యంతో ఇవ్వాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాల విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా నల్లగొండలో 18 గురుకుల విద్యాలయాలు నెలకొల్పగా, వాటిలో ల్యాబ్ అసిస్టెంట్లు17, కంప్యూటర్ ఆపరేటర్ ఒకటి కలిపి మొత్తం 18 పోస్టులను ఇటీవల భర్తీ చేశారు. సాధారణంగా పోస్టుల భర్తీ సమయంలో నోటిఫికేషన్ జారీ చేసి రోస్టర్ పద్ధతిలో ఎలాటెడ్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల మంజూరైన 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లేకుండా, కనీస అర్హత బైపీసీని విస్మరించి పది, పన్నెండు అర్హతతో భర్తీ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన వీఎల్ అవుట్ సోర్సింగ్ ఏజన్సీ ద్వారా స్థానిక ప్రిన్సిపాళ్ల సహకారంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారనే విమర్శలు వస్తున్నాయి.
గురుకుల విద్యాలయాల్లో మంజూరైన 18 అవుట్ సోర్సింగ్ పోస్టులు హెడ్ ఆఫీస్ నుంచే నియామకాలు జరిగాయని, బీసీ రీజినల్ యంత్రాంగం చెబుతున్నప్పటికీ మొత్తంగా ఆయా విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, రీజినల్ యంత్రాంగం సమన్వయంతోనే భర్తీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అర్హత లేని వారిని నియమించి ఒక్కొక్కరి దగ్గర రూ.రెండు లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులైన వారికి ఇవ్వకుండా అనర్హులకు ఇవ్వడంతోపాటు కనీసం నోటిఫికేషన్ కూడా జారీ చేయకపోవడంపై నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురుకులాల్లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకం తమకు సంబంధం లేదు. మొత్తం హెడ్ ఆఫీస్ నుంచే నియామకాలు జరిగాయి. విద్యాలయాల్లో పోస్టుల అవసరం ఉన్నందున త్వరగా భర్తీ చేయాల్సి ఉంది. దాంతో హెడ్ ఆఫీస్ నుంచే ఉద్యోగాల భర్తీ జరిగింది.
-షకీనా, బీసీ గురుకుల ఆర్సీఓ, నల్లగొండ