పాలకవీడు, జనవరి 25 : మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉర్సు గురువారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల జాతరలో తొలిరోజు గుసూల్ షరీఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేకువజామున దర్గా పూజారి సయ్యద్ జానీ గృహం నుంచి మేళతాళాలతో గంధ కలశాలను, దట్టీలను తలపై ఎత్తుకొని ఊరేగింపుగా దర్గాకు తీసుకొచ్చారు.
దర్గాలోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీన్ షా, జాన్పాక్ షహీద్ రహమతుల్లా అలై సమాధులతోపాటు బయట ఉన్న సైనిక సమాధులపై గంధం చల్లి, పూలమాలలు, దట్టీలతో అలంకరించారు. సమాధుల చుట్టూ మహిళలు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. దర్గాలో మగ్రీబ్ నమాజ్, ఈషాద్ నమాజ్లను దర్గా ముజావర్లు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దర్గాకు వచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొన్నారు. సమీపంలో గల నాగదేవతకు మహిళలు పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా పరిసరాలు సందడిగా మారాయి.
నేడు ఉర్సే షరీఫ్
ఉర్సులో ప్రధాన ఘట్టం రెండో రోజు గంధోత్సవం (ఉర్సే షరీఫ్). గంధోత్సవానికి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హాజరుకానున్నారు. కోదాడ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు నలమాద ఉత్తమ్ పద్మావతి, బీఎల్ఆర్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సైతం రానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. అందుకు తగ్గట్లుగా వక్ఫ్బోరు,్డ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.
అలరించిన ఖవ్వాలి
ఉర్సు సందర్భంగా ఫకీరులు జాన్పహాడ్ దర్గాకు తరలివచ్చారు. ఈ సందర్భంగా దర్గా లోపల, బయట ఫకీరులు నిర్వహించిన ఖవ్వాలి కార్యక్రమం అలరించింది. దట్టీల ఊరేగింపులో వీరి సందడి కనిపించింది.
భక్తులకు ఇబ్బంది లేకుండా..
గంధం ఊరేగింపునకు శుక్రవారం భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకా శం ఉన్నందున ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సూ ర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం జాన్పహాడ్ దర్గా వద్ద బందోబస్తు పర్యవేక్షించారు. నేరేడుచర్ల నుంచి వచ్చే వాహనాలను జాన్పహాడ్ గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద, దామరచర్ల నుంచి వచ్చే వాహనాలను శూన్యపహాడ్ రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద, దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వైపు నుంచి వచ్చే వాహనాలను రావిపహాడ్ గ్రామానికి వెళ్లే దారిలోనే నిలిపివేయడానికి పోలీసు శాఖ చేసిన పార్కింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం జేపీఎస్ ఫంక్షన్హాల్లో పోలీసు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి బందోబస్తుపై పలు సూచనలు ఇచ్చారు. డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. కోదాడ, మిర్యాలగూడ డిపోల నుంచి వయా దామరచర్ల, నేరేడుచర్ల మీదుగా 30కి పైగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది.