నార్కట్పల్లి, ఫిబ్రవరి 17 : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చిన భక్తులతో చెర్వుగట్టు క్షేత్రం కిక్కిరిసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
కల్యాణానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరయ్యారు. శివ నామస్మరణ, శివసత్తుల విన్యాసాలు, కోలాటాల నడుమ ఉత్తరాయణ పుణ్యకాలం మాఘమాస శుద్ధ సప్తమి (రథసప్తమి) గడియలో కల్యాణ తంతు జరిపించారు. అంతకుముందు తెల్లవారుజామున 2 గంటల నుంచే సుప్రభాత సేవ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణ పారాయణం, అన్నాభిషేక మహానివేదనం నిర్వహించారు. ఉదయం 4:05 గంటలకు మేళతాళాలతో శివసత్తుల విన్యాసాల నడుమ స్వామివారిని నంది వాహనంపై, అమ్మవారిని గజ వాహనంపై కూర్చోబెట్టి ఎదుర్కోలు చేపట్టారు.
అనంతరం కల్యాణ మండపం వద్ద విఘ్నేశ్వర పూజ, పుణ్యావాహచనం, రక్షాసూత్రాధారణ నిర్వహించి 5:05 గంటలకు జీలకర్ర బెల్లం పెట్టించారు. అమ్మవారికి రక్షా సూత్రాధరణ చేశారు. జగత్ రక్షకుడైన పరమేశ్వరుడి గొప్పతనం వృత్తాంతాన్ని వివరించి మాంగళ్యం తంతుణానే లోకరక్షణా హేతునాం అంటూ యాజ్జీకులు మంత్రాలు పటిస్తుండగా 5 గంటల38 నిమిషాలకు త్రినేత్రుడు పార్వతీ అమ్మవారికి మాంగళ్యధారణ చేసే ఘట్టాన్ని భక్తులు తనివితీరా తిలకించారు.
పరిణయ శోభతో మనోహరంగా దర్శనమిచ్చిన ఆది దంపతులకు తలంబ్రాలను సమర్పించుకున్న భక్తులతో కల్యాణ వేదిక కిక్కిరిసిపోయింది. దాదాపు 500 క్వింటాళ్ల పసుపు బియ్యాన్ని తలంబ్రాల రూపంలో అందించారు. యాజ్ఞీకులు అల్లవరపు సుబ్రమణ్యదీక్షితావధాని ఆచార్యత్వంలో ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు నీలకంఠ శివాచార్యులు వ్యాఖ్యానం చేస్తుండగా రుత్వికుల వేద మంత్రాల మధ్య కల్యాణ తంతు జరిపించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, ఇన్చార్జి ఈఓ నవీన్, దేవాలయ సిబ్బంది వసతులు కల్పించారు. డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామిని సినీ డైరెక్టర్ ఎన్.శంకర్ దంపతులు దర్శించుకున్నారు.
దేవాలయం అభివృద్ధికి కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
చెర్వుగట్టు దేవస్థానం ప్రముఖ యాత్రా స్థలాల్లో ఒకటిగా వెలుగొందుతున్నందున దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రాబోయే 3 నెలల్లో బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. చెర్వుగట్టు దిగువకు రెండో ఘాట్ రోడ్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేవాలయ అభివృద్ధికి సహకరిస్తామని, మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ చేపడుతామని చెప్పారు.
నేడు శేష వాహన సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున శేష వాహనంపై స్వామివారి సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు రామలింగేశ్వర శర్మ తెలిపారు. సూర్య నమస్కారాలు, గవ్వంత అర్చనలు, దీక్షా హోమం, రుద్ర హోమం, బలిహరణం, వేదస్వస్తి, రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పార్చన, ఆంజనేయస్వామికి లక్ష తమలపాకులతో పూజ నిర్వహించనున్నట్లు చెప్పారు.