పాలకవీడు మండలం జాన్పహాడ్ గ్రామంలోని సైదులు బాబా దర్గా ఉర్సుకు సిద్ధమైనది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 400 సంవత్సరాల ఘనమైన చరిత్ర గల దర్గా భక్తుల కోరిన కోర్కెలు తీర్చేదిగా నిలిచింది. ప్రతి యేటా ఉర్సుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దర్గాకు చేరుకోవాలంటే నేరేడుచర్ల పట్టణం నుంచి 19 కిలోమీటర్లు ప్రయాణించాలి. దామరచర్ల నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది.
దర్గా చరిత్ర
400 సంవత్సరాల క్రితం మద్రాస్ రాష్ట్రంలో నాగర్ గ్రామంలోని నాగూర్షరీఫ్, ఖాదర్ దర్గా విశిష్టతను పక్క రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు జాన్పహాడ్ సైదా, మొహినుద్దీన్ అనే భక్తులు ఊరూరా తిరుగుతున్నారు. మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి అమరులయ్యారని, దాంతో జాన్పహాడ్ సైదా, మొహినుద్దీన్ జ్ఞాపకార్థం వజీరాబాద్(వాడపల్లి) రాకుమారుడు దర్గాను నిర్మించారని కథనం ఉన్నది. దర్గాలో సమాధుల వద్ద నిత్యం ప్రార్థనలు చేయగా ఆ తర్వాత దర్గా విశిష్టత వాడుకలోకి వచ్చింది.
ప్రత్యేక స్థలాలు
జాన్పహాడ్ దర్గా వద్ద గొల్ల భామ గుడి, సఫాయిబావి, సిపాయి బాబా సమాధులు, నాగేంద్రుని పుట్ట, నిత్యం వెలిగే దీపం ఉంటాయి. గొల్లభామ గుడి : దర్గా గ్రామ శివారులో గొల్లభామ గుడి ఉన్నది. దీన్ని గొల్లభామ గుట్టగా పిలుస్తారు. భక్తులు దర్శించుకొని కోరికలు కోరుకొని రాయిని విసిరి వెళ్తారు. సఫాయి బావి : దర్గాకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా భూపతి రాజు శేషారెడ్డి కలలోకి సైదులు బాబా వచ్చి గుర్రపు డెక్కలు ఉన్న చోట బావిని తవ్వించాలని చెప్పాడట. ఆ ప్రదేశంలో బావిని తవ్వించగా దానిని సఫాయి బావిగా పిలుస్తున్నారు. భక్తులు ఈ బావి నీటితో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో వంటలు చేస్తారు. నీటితో స్నానం చేస్తే మానసిక ఆందోళనలు తగ్గుతాయని, నీటిని పంట పొలాలపై చల్లితే అధిక దిగుబడులు వస్తాయని భక్తుల నమ్మకం.
సిపాయి బాబా(తాళాలస్వామి) :
సైదులు బాబాకు అంగరక్షకుడిగా ఉండే సిపాయి బాబా కూడా మత ప్రచారంలో భాగంగా సైదులు బాబాతోపాటే మరణించాడని చరిత్ర. దాంతో సైదులు బాబాతోపాటు సిపాయి బాబా దగ్గర కూడా మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ సమాధి చుట్టూ ఉన్న గ్రిల్స్కు తాళం వేసి వెళ్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కోరికలు తీరితే మళ్లీ వచ్చి తాళం తీస్తారు. అందుకే తాళాల స్వామిగా పిలుస్తారు.
కందూరు
భక్తులు కోరిన కోర్కెలు తీరితే దర్గా వద్ద కందూరు నిర్వహిస్తారు. దీనికోసం భక్తులు బంధుమిత్రులతో కలిసి దర్గాకు వస్తారు. సఫాయి బావి నీటితో వంటకాలు చేసుకొని అక్కడే భోజనం చేస్తారు. దీనినే ఫాతేహగా పిలుస్తారు.
జనవరి చివరి శుక్రవారం
జాన్పహాడ్ దర్గాలో ప్రతియేటా జనవరి మాసం చివరి శుక్రవారం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మూడు రోజుల ఉత్సవాల్లో ప్రధానమైనది గంధోత్సవం. ఇది రెండో రోజు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చి ఊరేగింపులో గంధం అందుకోవడానికి పోటీ పడుతారు. ఈ గంధాన్ని తాకినా, దీనిని ఇంటికి తీసుకెళ్లినా మంచిదని భక్తుల నమ్మకం.
హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీక జాన్పహాడ్ దర్గాను హిందూ, ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటారు. దర్గా ఆవరణలో నాగుల పుట్ట వెలిసింది. ఇక్కడ పెద్ద ఎత్తున కొబ్బరి కాయలు కొట్టి, పసుపు కుంకుమలు సమర్పిస్తారు. తొలుత సైదులు బాబా సమాధుల వద్ద మొక్కుకొని తమ కోర్కెలను విన్నవించుకుంటారు.
నాగేంద్రుడి పుట్ట, నిత్యం వెలిగే దీపం
దర్గా లోపలికి వెళ్లే కుడి వైపు నాగేంద్రుని పుట్ట ఉంటుంది. పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమ సమర్పిస్తారు. ఈ పుట్ట దగ్గర పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.తలనీలాల సమర్పణ, నామకరణాలు సైదులు బాబాపై ఈ ప్రాంతంలో భక్తులకు అపార నమ్మకం. భక్తులు దర్గా పరిసరాల్లో తలనీలాలు సమర్పిస్తారు. తమకు పుట్టే సంతానానికి సైదిరెడ్డి, సైదయ్య, సైదులు, సైదా, సైదమ్మ, సైదయ్య, సైదారెడ్డి, దర్గయ్య, దర్గారావు, దర్గారెడ్డి వంటి పేర్లు పెట్టుకుంటారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో సుమారు 40 వేల మందికి పైగా ఈ పేర్లతోనే ఉన్నారని అంచనా.