మునుగోడు, మే 12 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్-2023 క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టగా గ్రామాల్లో సందడి నెలకొంది. మూడు రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించస్తుండగా వాటిని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అయింది. మండల స్థాయిలో రాణించిన వారిని జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసే అవకాశం ఉండడంతో తమ ప్రతిభను చాటేందుకు యువత ఉత్సాహం చూపుతుంది.
మండల స్థాయిలో..
ఈ నెల 15,16,17 తేదీల్లో సీఎం కప్ టోర్నీలు మండల స్థాయిలో జరుగనున్నాయి. ఇందులో భాగంగా అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. మండల స్థాయిలో గెలుపొందిన జట్లను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడా ప్రతిభ చూపితే రాష్ట్ర స్థాయిల్లో అవకాశం కల్పిస్తారు. మండల స్థాయిలో పోటీల నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీపీ చైర్మన్గా, ఎంపీడీఓ కన్వీనర్గా, జడ్పీటీసీ, తాసీల్దార్, ఎంఈఓ లేదా గెజిటెడ్ హెచ్ఎం, ఎస్ఐ, పీఈటీలు సభ్యులుగా ఉంటారు.
ఏర్పాట్లకు సన్నాహాలు..
మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలు జరుగనున్నాయి. ఏర్పాట్లపై ఇప్పటికే మండల కమిటీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. క్రీడాకారుల వివరాల నమోదు,ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించారు. పోటీల్లో ప్రతి గ్రామం నుంచి ఒక టీమ్ పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకు 15-35 ఏండ్లలోపు వారు అర్హులుగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు 14వ తేదీలోగా ఎంపీడీఓ కార్యాలయంలో లేదా 9985819044 నంబర్కు సందప్రదించాలని అధికారులు సూచించారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకే..
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం సంతోషకరం. వీటి ద్వారా గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించే అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా గొప్ప క్రీడాకారులను గుర్తించి వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.
– కర్నాటి స్వామియాదవ్, ఎంపీపీ మునుగోడు, సీఎం కప్ టోర్నీ చైర్మన్
గ్రామీణ క్రీడాకారులకు వరం….
సీఎం కేసీఆర్ గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించడం హర్షణీయం. ఇందులో రాణించే క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మండలంలోని క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి సత్తా చాటాలి.
– నారబోయిన స్వరూపారాణి, జడ్పీటీసీ, మునుగోడు